Saturday, February 11, 2012

తెలుగు సాహిత్యం



సాహిత్యం అంటే....

(ఇదివరకటి నా టపా "చక్కని సాహిత్యం అంటే....ఇలా వుండాలి ట" కి కొందరైనా సాహితీపరులు స్పందిస్తారనుకున్నాను. అంతకు ముందు టపాలకి కూడా స్పందన లేదు....యెందుకో మరి)

కవీ, రచయితా, చిత్రకారుడు, ఇంకా చాలా అయిన "బహుముఖ ప్రజ్ఞావంతుడు" అడివి బాపిరాజు 1946 లో వ్రాసిన "కోనంగి" నవలలోనివి ఆ టపాలో వ్రాసిన పేరాలు.....అక్కడక్కడా సేకరించినవి.

ప్రతి పిచ్చిరాతా "సాహిత్యం"గా చెలామణి అయిపోతున్న ఈ రోజుల్లో, అలాంటి సాహిత్యం అరుదుగా కనిపిస్తుంది అనే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాశాను.

ఒక సమయంలో, సినీ పరిశ్రమలో అ, ఆ లు అంటే, "అక్కినేని, ఆదుర్తి" అనేవారు. అవేరోజుల్లో, అక్కినేని "అ ఆ లు" (అక్కినేని ఆలోచనలు) అనే పేరుతో కవితలు వ్రాస్తే, "వీడికి అదొక్కటే తక్కువ" అన్నవాళ్లున్నారు. 

ఇప్పుడొస్తున్న కవితలూ, తవికలూ, హైకూలు, నానీలు, నానోలు, తాతీలు, తాతూలు లాంటి "కవిత్వం" తో పోలిస్తే, అవి గొప్పకవితలు అనిపిస్తాయి.

అవి ఇప్పుడు యెక్కడైనా దొరుకుతున్నయో లేదో!

Friday, December 23, 2011

చక్కని సాహిత్యం అంటే……

......ఇలా వుండాలి(ట)!


అనంతలక్ష్మి దేహంలో మనస్సులో నిర్మలత్వం ఉంది. రఘునాధరాయని హృదయ మహారాజ్యం ఆక్రమించి, చక్రవర్తియై రాజ్యమేలిన దివ్యసుందరి, భూమికి దిగివచ్చిన పరమాప్సరస సుందరి మధురవాణి అందమంతా ఈ బాలికలో ప్రత్యక్షమైంది. కొంచెం కోల, కొంచెం గుండ్రని మోము, అయిదడుగుల ఎత్తు, పొట్టి పొడుగుకాని ముక్కు, సమమైన కోలతనంలో దవడలో, బుగ్గలు ఫాలము ఏకరేఖా ప్రవాహ సామ్యం కుదిరి వుంటాయి. అలాంటి మోము గుంటలుపడే బుగ్గలు, కొంచెం పైకి తిరిగిన పై పెదవి, కొంచెం అంటే కొంచమే ఎత్తయిన క్రింది పెదవీ, సుడులుపడే సమ చుబుకమూ ఉండి, ఆ మోము కాసు బంగారం రంగు కలిగి, ఆ రంగుకు తగినట్లు లేత గులాబీ రాగం అప్పుడప్పుడా బుగ్గలకి ప్రసరిస్తూ ఉంటే, అలాంటి సౌందర్య నిధులన్నీ చేకూరినచోట, ఆ నిధులకు కిరీటంలాంటి కళ్ల అందం వెలసిందనుకొంటే, ఆ దివ్య సౌందర్యవదనం అనంతలక్ష్మిది. కాంచనమాలను, సుబ్బలక్ష్మిని, నళినీజయవంత్ ను ముగ్గురినీ కరిగించి పోతపోస్తే అనంతలక్ష్మి అవుతుంది.

ఆవును. అనేకమందికి చక్కని హృదయాలనన్నీ గబగబ పువ్వుపుణికినట్లు పుణికే శక్తిగల సౌందర్యపూర్ణమైన మోము ఉంటుంది. అంతే. ఆ మోముకు తగిన తలగానీ, తలకట్టుగానీ ఉండవు. ఆతి పెద్ద లంకగుమ్మడి లాంటి తలో, పొన్నకాయలా మెదడులేని తలో ఉంటాయి. ఆనంతలక్ష్మికి తలకట్టు, తోడిరాగాలాపన ఆమె కేశ సౌభాగ్యము. కేశరంజనివారి ప్రకటన చిత్రాల తలకట్టులకు పాఠాలు నేర్పుతుంది. 




……………

ప్రేమ అనే మహోత్తమ స్థితి మనుష్యుని జీవితంలో ఊరికేరాదు. భర్తతో స్నేహమూ, స్త్రీ పురుష సంబంధ ప్రీతీ సమ్మిశ్రితమై ఒకరకమైన ప్రేమగా పరిణమిస్తాయి. ఒకనాడాస్థితి సంపూర్ణ ప్రేమ కావచ్చును.

కాని అసలు ప్రేమే స్త్రీకిగాని, పురుషునికిగాని సంభవిస్తే, అది అమృత మహానది. సరస్సు కట్టలు తెగినట్లవుతుంది.



* * *

“ఆకలి అవుతున్నది గాని (జావ) సహించడంలేదు లక్ష్మీ!”
“మీ వంట్లో ఒక వీశెడు క్వినయిను ప్రవేశించింది. అందుకనేగాదండీ మిమ్మల్ని పళ్లరసం తెగతాగమంటారు డాక్టరు!”

“సరేలే! రెండుమూడురోజులలో పైత్యనాడి తిరగకపోతుందా ఏమిటి? తిరక్కపోతే పైత్తకారినే అయిపోతాను!”


“అయితే గురువుగారూ, మీరు ఎప్పుడూ అల్లా నవ్వువచ్చే మాటలు మాట్లాడుతూనే ఉంటారా?”

“నాకు ఏడుపు మాటలు చేతకావు. కృష్ణశాస్త్రిగారి శిష్యరికంచేసి ఇంత ఏడుపు కవిత్వం రచించడమన్నా నేర్చుకోవాలి!”
“నవ్వుకవిత్వం, ఏడుపు కవిత్వాలేగాని, ఇంకోరకం కవిత్వం తెలుగులో లేనేలేవా అండి?”
“లక్ష ఉన్నాయి. రాయప్రోలువారి ప్రియురాలే చెల్లెలు కవిత్వం, వేదులవారి పూవుల కవిత్వం, నండూరివారి పల్లెటూరి కవిత్వం, తుమ్మలవారి రైతు కవిత్వం, విశ్వనాథవారి ఎత్తుకొండల కవిత్వం, కాటూరి పింగళుల తేనేపెరడు కవిత్వం, కవికొండలవారి అటుకులు, జీడిపప్పు కవిత్వం, దీక్షితులవారి బువ్వాలాట కవిత్వం……”
“అదేమిటండీ! ఒకటడిగితే ఇరవై చెబుతారు ఇంతనీరసంగా ఉన్నారు కూడా?”
“ఈలా మాట్లాడుతూ ఉంటే, కాస్త జావకూడా సయిస్తుంది. ఇంకో వెండిగిన్నెడు జావా, దానితోపా సాతుకుడిరసం ఒక పెద్ద గ్లాసుడూ పట్టుకురా అనంతయ్యగారూ!”



……….


ఆమె పరుగెత్తుతూ ఉంటే ఆమె దేహ సౌష్టవచంద్రిక వెన్నెల కురుస్తుంది అనుకొన్నాడు…..ఎక్కడా అపశ్రుతిలేని శరీరాంగ నిర్మాణం ఈమెలో చేతులూ, వక్షనిధులు, నడుము, కటి, కాళ్లు, పాదాలు బ్రహ్మదేవుడు దివ్యలలిత కళాపారవశ్యకతతో సృషించి ఉంటాడనుకున్నాడు. ఆందమైన బాలికలు ఉండడమే లోకానికి ఆపత్తు. ఆందం సూదంటురాయి. మగవాళ్లు అనే ఇనుప శకలాలను ఆకర్షిస్తే ఏలాగు తనబోటి దద్దమ్మల బ్రతుకు!
(అంతలో కాస్త చరిత్ర)

"డాక్టరు రంగనాయకులు రష్యా ప్రియుడు, కమ్యూనిస్టువాది. కాంగ్రెసులో పనిచేసి దేశంలో ఉన్న శక్తులను కాంగ్రెసు కట్టుకురాలేకపోతున్నదని, అహింసా వాదమువల్ల ఎదుటివాడి హృదయం మార్చడం అనే ఆశయం ఉద్భవం అవుతుందనీ, ఈలోగా తిండిలేక మాడిపోతూ ఉంటారు ప్రజలు అనీ నిర్ధారణచేసుకున్నాడు. ఆచార్య నరేంద్రదేవు, జోషీ, జయప్రకాష్ మొదలగువారి వాదనలు నచ్చాయి. ఆ రోజుల్లో కాంగ్రేసు ఎడమచేతి వాదన వారుండేవారు. వారు కాంగ్రెసు సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనీ.

జోషి మీరట్ కేసులో ఉన్నాడు జైలుకి వెళ్లాడు. ఆ సందర్భంలోనే ఆ తర్వాతనే జోషి, డాంగే మొదలగువారు కమ్యూనిస్టులుగా ఉండి రహస్యంగా సామ్యవాదాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. వారిలో చాలామంది కాంగ్రెసు సభ్యులే.

ఫ్రభుత్వం కమ్యూనిస్టు సంఘాలను నిషేధించింది. ఆ కారణం చేత కమ్యూనిస్టులు కాంగ్రెసులోనే ఉండి పనిచేస్తూ వుండిరి.
జయప్రకాష్ నారాయణ్, మెహరల్లీ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైనవారంతా కాంగ్రెస్ లో సోషలిస్టులుగా (సాంఘికవాదులుగా) ఉండేవారు.
డాక్టరు వీరి వ్రాతలు చదివేవాడు. బోల్షివిజం ను గురించి చదివేవాడు. 1928లోనే పరీక్ష పూర్తిచేసి, 1930లో మదరాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. ……1930లో కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభించింది. 1931 తిరిగి వచ్చింది. మళ్లీ 1932 కాంగ్రెసువారినందరినీ కారాగారాలలో బంధించారు. కాని చాలా మందిని ప్రభుత్వంవారు లాఠీ ప్రయోగం చేసి మాత్రం వదులుతూ ఉండేవారు.........."
(అవునా?)


Saturday, December 3, 2011

మన సినీ సాహిత్యం



ఓ.......కోలవెరి!

ఈ మధ్య "త్రీ" సినిమా కోసం కుర్రాళ్లు ట్యూన్ చేసి పాడిన కోలవెరి పాట ప్రపంచ వ్యాప్త హిట్ అయి, అందరినోళ్లలోనూ నానుతోంది!

అందులో యేమిటీ గొప్పతనం? గొప్ప సాహిత్యం వుందా? గొప్ప సంగీతం వుందా? గొప్ప వాయిద్యసహకారం వుందా? మరేమిటి?

శంకరాభరణం శంకర శాస్త్రి "బ్రోచేవారెవరురా" గురించి అన్నట్టు--"ఆ కీర్తన అణువణువులోనూ 'ఆర్ ద్రత' నిండివుంది దాసూ!"--అదీ సంగతి.

కొన్ని నెలలుగా గుళ్లలో వినిపిస్తున్న పాటలని--ఈ మధ్య కుర్రపిల్లలు విడుదలచేశారని పేపర్లలో మెచ్చుకొంటున్న "......పూజలు" సిరీస్ సీడీల్లాంటివేమో అనుకున్నాను. 

పెద్దల బ్లాగులు చదవగా తెలిసింది అవి "శ్రీరామ రాజ్యం" సినిమాలోవని!

లవకుశ పాటలన్నీ ఇప్పటికీ హిట్ గా  యెందుకున్నాయి, ఈ పాటల ఆయుర్దాయం యెంత అని యెవరైనా ఆలోచిస్తే......నిజం తెలీదూ?

పైగా, పాటల రచయితల "స్వకుచమర్దనం" ఒకటీ! ఆపాటకి స్ఫూర్తి...అలా...అంటూ!

ఇప్పటి చిన్నారులకి పద్యాలు వినిపిస్తే మీచేతులు కొరికి పారిపోతున్నారా? వాటి అర్థం మీకే తెలీదుకాబట్టిగానీ, ఇది వరకు మా చిన్నారులకి మేము వినిపించలేదా? వాళ్లు మా చేతులు కొరికి పారిపోయారా? 

"శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా....." అంటే వాళ్లకి అర్థం కాదు అని మీరు నిర్ధారిస్తే, అది యెవరి తప్పు? 

అదీ తెలీకపోతే, "నాదు జపము తపమూ, నా కావ్యమే వృధా"!

Friday, September 30, 2011

తెలుగుభాషా......




.......వికసనం

మన తెలుగు భాషలోని "పందికొక్కు" అనే మాటని ఇంగ్లీషువాళ్లు స్వీకరించి, వాళ్ల భాషలో "బేండికూట్" అని చేర్చుకొన్నారట! అలాగే కదా భాష వికసించేది! 

ఇంకా యెన్ని విధాలుగా వికసించగలదో అనే ఆలోచన వచ్చేసరికి కొన్ని పాత విషయాలు జ్ఞాపకానికొచ్చాయి. 

మేం రెండో ఫారం (యేడో క్లాసు) చదివేటప్పుడు--1962లో--మా క్లాసు టీచరు--డేనియల్ మేష్టారు వుండేవారు. 

"నేను రోజూ సైకిలుమీద 'సఖం చెరువు ' (వారి స్వగ్రామం) నుంచి వస్తాను. తొమ్మిదింటికి స్కూలు అంటే, నేను యెప్పుడు బయలుదేరుతానో, ప్రొద్దున్నే యెన్నింటికి లేస్తానో వూహించండి. అలాంటిది, ఈ వూళ్లోనే వున్నవాడివి లేటుగా వస్తావా?" అని దులపరించేసేవారు లేటుగా వచ్చిన విద్యార్థులని బోర్డు ప్రక్కన గోడకానుకొని నిలబెట్టి! 

విషయానికొస్తే, ఆయన వూరి పేరు "సంఘం చెరువు". మునుపెప్పుడో డచ్చివాళ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రోజుల్లో, స్థానిక "సాలె"వారు తయారు చేస్తున్న అద్భుతమైన "అద్దకం" వస్త్రాలని చూసి, ముగ్ధులై, ఆ వస్త్రాలని అనేకసార్లు వుతకవలసిన అవసరాన్ని గమనించి, వారికి గ్రామ గ్రామానా చెరువులని "వ్రాసి ఇచ్చారు". 

వివిధ వూళ్లలో వాటిని "వూరి చెరువు"; "వూర చెరువు"; "సంఘం చెరువు".....ఇలా పిలిచేవారు. మా నరసాపురానికి దగ్గర్లో వున్న చెరువుని సంఘం చెరువు అనేవారు(ట). రానురానూ, ప్రజల పలుకుబడిలో అది "సగం చెరువు" ఐపోయింది. మరి "సగం" అంటే "అర్థ" అని అర్థం కదా? సగం అనేది పామర భాష....దానికి సరైన రూపం "సఖం" అని ఆయన అభిప్రాయం! యేది రైటంటారు?! 

(ఇప్పుడలాంటి చెరువులు లేవు. కొన్ని కబ్జా అయిపోయి కాలనీలు వెలిశాయి, కొన్ని పూడ్చబడి మునిసిపాలిటీలూ ప్రభుత్వం ఆక్రమించుకొన్నాయి. గత 50 యేళ్లుగా ఆ చెరువులని మాకు స్వాధీనం చెయ్యండి అంటూ పోరాడుతున్నారు ఆ కళాకారులు వివిధ కోర్టుల్లో!)

ఇంకో మేష్టారు వుండేవారు ప్రసాదంగారు అని. 

మామూలుగా జనం "సీతాఫలం" ని సీతాబళా పండు అనీ, "రామాఫలం"ని రాంబళా పండు అనీ, "లక్ష్మణఫలం"ని లక్షంబళం అనీ--దీన్ని చాలామంది చూసి వుండరు--అంటారు. 

అలాగే, క్రీస్తు పుట్టే సమయానికి ఆకాశంలో ఓ నక్షత్రం పొడిచి, దాని ఆథారంగా తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు పుట్టిన చోటికి చేరి, "సాంబ్రాణి"; "బోళము" వగైరాలు అర్పించారు(ట). 

ఇంక మా మేష్టారు, సైన్స్ పాఠం చెపుతూ, "మనగుండె 'రామబోళము ' ఆకారములో వుండును" అని చెప్పేవారు. (రాంబళా అనడం తప్పు, రామ ప్రక్కన వుండవలసింది 'బోళము ' అనడమే కరెక్టు అని ఆయన వుద్దేశ్యం!

ఇలా ఇప్పటికీ, చాలామంది మన భాష 'వికసనానికి ' తమవంతు సేవ చేస్తూవస్తున్నారు!

మీకు తెలిసినవాళ్లగురించి కూడా చెప్పండి.  

Monday, September 19, 2011

తెలుగు సినీ సాహిత్యం



.....హిట్/ఫట్ పాటలు

ఓ ముఫై ఐదేళ్ల క్రితం అనుకుంటా, రేడియోలో ఓ కార్యక్రమం ప్రసారం అయ్యేది--అందులో ఒక పాటని ప్రసారం చేసేవారు. శీర్షిక "సినిమాలో మాత్రమే వినిపించిన పాట" అనో యేదో వుండేది. (అంటే బయట "హిట్" కాని, మంచి పాట అని అనుకుంటా వాళ్ల వుద్దేశ్యం). 

ఆ శీర్షికలో నాకు బాగా జ్ఞాపకం వున్న పాట, "బ్రహ్మ పట్నం పోదమంటే దారి తెలియదు అన్నయా! సూటిగా చుక్కానిపట్టీ నావ నడపవే చెల్లెలా!" అనేది. తరవాత ఇంకోపాట--"దేవీ సేమమా? దేవరవారూ సేమమా?" అనే పాట అని గుర్తు. 

మొదటి పాట సంగతి నాకు గుర్తులేదు గానీ, రెండో పాట వ్రాసినది మాత్రం, మా గురువుగారు, "ఆచార్య ఆత్రేయ"! అప్పట్లో ఓ జోకుండేది--కృష్ణశాస్త్రి వ్రాసి (జనాలని) యేడిపిస్తే, ఆత్రేయ వ్రాయక (నిర్మాతలని) యేడిపిస్తాడు--అని! ఇంకా, ఆత్రేయకి ఓ 5స్టార్ హోటల్లో బసయేర్పాటుచేసి, ఓ వారంపాటు జాగ్రత్తగా చూసుకొంటే (ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ నిరంతరాయంగా అందిస్తే) ఓ వారంలో ఖచ్చితంగా ఓ "హిట్" పాట వస్తుంది అని! (అదే స్కాచ్ బదులు ఇండియన్ విస్కీ అందిస్తే, ఇలాంటి పాటలే వస్తాయి అని కూడా చెప్పుకునేవారు!). ఇవన్నీ "పాప్యులర్ గాసిప్సే" అయ్యుండవచ్చు. తరువాత ఆయన "కోడెనాగు" సినిమాలో శోభన్ బాబుకి గురువుగా నటించారు కూడా.

ఇంకో గొప్పపాట, ఎస్ పీ కోదండపాణి పాడిన "ఇదిగో....దేవుడు చేసిన బొమ్మా....ఇది నిలిచేదేమో మూడురోజులు, బంధాలేమో పదివేలు!". చాలా మంచి పాట. ఆ విధంగా ఆయన తప్ప ప్రపంచంలో యెవరూ పాడలేరు మరి!

అలాగే, హిందీ గీత రచయిత "ఆనంద్ బక్షీ" ఉప్ హార్ అనే సినిమాలో ఓ పాట పాడారు--"బాగోం మే బహార్ ఆయీ, హోఠోం పే పుకార్ ఆయీ, ఆజా, ఆజా, ఆజమేరి రాణీ" అంటూ. అది కూడా అనితర సాధ్యం!

ఎస్ డీ బర్మన్ పాతకాలంలో పాడిన ఓ పాట వుంది--"ధీరెసె జానా ఖటియన్ మే, ఓ ఖట్ మల్, ధీరెసెజానా ఖటియన్ మే!" అనో, "ధీరెసెజానా బగియన్ మే, ఓ భౌఁరా, ధీరెసెజానా బగియన్ మే!" అనో!

ఇలాంటి చమక్కులు ఇప్పుడు లేవు!

ఇప్పుడన్నీ "ఓయ్, ఓయ్"; "డోయ్, డోయ్" లే మరి!


Thursday, September 1, 2011

రసఙ్ఞత



రసన

మనుషులకి (జంతువులక్కూడా) వుండే అవయవాల్లో ఈ రసన అనబడే నాలుక, ఓ అతి విచిత్రమయిన అవయవం.

మరి దానికి తోడు "అంగుడి"!

నాలుకమీదవేసుకోగానే, పదార్థం రుచిని గ్రహించి, దాన్ని అంగుడికి హత్తగానే--ఓహ్! ఇదే స్వర్గం అనిపించేలా చేస్తాయి ఈ రెండూ!

ఇంగ్లీషువాళ్లు కూడా రుచి ని చెప్పడానికి "ప్యాలటబుల్"; "ఫర్ ది ప్యాలేట్"....ఇలా వాడతారు. అదీ అంగుడి ప్రాధాన్యం.

ఆ రెండూ లేకపోతే, మనం కూడా ఆకులూ, అలమలతోపాటు, మట్టీ, మశానమూ తింటూ వుండేవాళ్లం!

సాహిత్యంలో ఈ రసనకి ఓ విశిష్ట స్థానం వుంది. అనేక పద్యాలు వున్నాయి. "వివాహభోజనంబు" లాంటి పాటలూ వున్నాయి. 

ఈ సందర్భంలో నాకో విషయం గుర్తొచ్చింది.

మా హైస్కూల్లో వుత్తరాంధ్రనుంచో, దక్షిణాంధ్రనుంచో ఇద్దరు ఆడపిల్లలు కొత్తగా చేరారు యేదో చిన్న క్లాసులో. మాకన్నా చిన్నవాళ్లు, అక్కచెల్లెళ్లు. ఆ సంవత్సరాంత  సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ ప్రదర్శన ఇచ్చారు.

తెల్లటి పొడుగుచేతుల చొక్కాలూ, షరాయిలూ వేసుకొని, కుచ్చు తలపాగాతో, చేతిలో కంజరి లాంటి డప్పులతో (కాళ్లకి గజ్జెలు కూడా కట్టుకున్నారేమో) ఓ చక్కని సరదా పాట పాడారు. విషయం సరిక్రొత్తదవడంతో, అందరూ తలమునకలుగా ఆనందించారు. ఆ పాట ఇలా సాగుతుంది--నాకు ఙ్ఞాపకం వున్న రెండుమూడు లైన్లు......

(ఒక వూరికి)"......వచ్చారూ ముగ్గురు షరాబులూ.....ఒకడికి అంగుడేలేదూ, ఇద్దరికి మింగుడేలేదూ"

"అంగుడి మింగుడు లేనివారలూ దున్నారూ మూడెకరాలూ.....ఒకడికి అరకేలేదూ, ఇద్దరికి యెడ్లే లేవూ"

"నాగలి యెద్దులు లేనివారలూ వేశారు మూడు విత్తనాలూ....ఒకటి యెండేలేదు, రెండు పండేలేదు!"

.......అలా సాగుతుంది. (పైన వ్రాసినవికూడా కరెక్టు కాకపోవచ్చు!)

వాళ్లు ఈపాటికి బ్లాగులు చదువుతూ, వ్రాస్తూ వుండి వుంటారని నా అంచనా.

యెవరికైనా ఈ గీతం/గేయం తెలిస్తే, వెంటనే పూర్తిగా ప్రచురించండి.....అందరికీ పరిచయం చెయ్యండి.

బుర్రుపిట్ట పాటల్లాగే, ఇదీ సాహిత్య సేవే! 

Sunday, July 3, 2011

అన్నమయ్య సాహిత్యం.....

 .....తి తి దే ప్రాజెక్టూ

నా ఈ ఆంతర్యం (బ్లాగు)లో "ముద్దు కారే" టపా వ్రాసిన నెలా పదిహేనురోజులకి ఓ స్పందన వచ్చింది వులిమిరి సూర్యనారాయణ గారి నుంచి. అంతలో మరో స్పందన--లలిత గారి నుంచి! ఇద్దరూ మంచి సమాచారం ఇచ్చారు. వులిమిరివారైతే, గరిమెళ్ల వారి పాటల లింకు రూపంలో వో ఖజానానే ఇచ్చారు. లలితగారు పిల్లలకోసం మంచి బ్లాగ్ నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ నా ప్రత్యేక అభినందనలు.

కానీ--నేను విమర్శిస్తూవస్తున్నది తి తి దే వారి సోకాల్డ్ అన్నమాచార్య ప్రాజెక్టునీ, అందువల్ల తెలుగు వాళ్లకి వొనగూడిన "ప్రయోజనాన్నీ"! ఆ ప్రాజెక్టూ, వాళ్లు పరిష్కరించామని చెప్పుకుంటున్న అప్పటి తెలుగు లిపి గురించీ! నా ఇదివరకు టపాలలో, "పదివేల శేషులు" యెక్కడనించి వచ్చారూ? "పన్నగంపు" అంటే యేమిటీ? "దోమతెరలు" అప్పుడు వున్నాయా?--ఇలాంటి వాటి గురించి వ్రాశాను. మెచ్చుకున్నవాళ్లు మెచ్చుకున్నారు. ఇప్పుడే కాస్త "సబ్జెక్ట్" వున్నవారి స్పందనలు వచ్చాయనుకుంటా.

నా బాధంతా, పాతకాలంలో కూడా వాళ్లకి "అందుబాటులోవున్న పరిమిత" వనరుల ఆథారంగా, మల్లంపల్లివారూ, రాళ్లపల్లివారూ, తాపీ వారూ, తూమాటివారూ, అక్కిరాజువారూ--మనకి తెలియని, యెప్పటికీ తెలుసుకోలేని, పాళీ, పైశాచీ, ప్రాకృత, ప్రాచీన తెలుగు లాంటి భాషలలో వున్న శాసనాలూ వగైరాలని, "మనకి అర్థం అయ్యేలా, సంతృప్తి కలిగేలా" వివరించగలిగారు.

మరి "జాను తెనుగు"లో వ్రాసిన అన్నమయ్య కీర్తనలని, సామాన్య భక్తుల మనోభావాలని ప్రతిబింబిస్తూ, వ్రాసిన అన్నమయ్య కీర్తనలు అర్థం లేనట్టుగా, మనకి అర్థం కానట్టుగా యెందుకు పరిష్కరించారు? వాటిని మనం గుడ్డివాళ్లలా అనుసరించాలా? ఇవీ ప్రశ్నలు.

మేము హైస్కూల్లో వున్నప్పుడు, మా తెలుగు పాఠ్య గ్రంధాల్లో, "కమలాక్షునర్చించు కరములు, కరములు" లాంటి పద్యాలూ, అందులో అలంకారాలూ చదువుకున్నాము. అలాగే అప్పటికి అందుబాటులో వున్న కొన్ని అన్నమయ్య కీర్తనలగురించీ, ఆయన జీవితం గురించీ, 32 వేలకు పైగా కీర్తనలు వ్రాశాడనీ, వాటిని ఓ రాజుగారు రాగిరేకులమీద వ్రాయించి భద్రం చేశాడనీ చదువుకున్నాము. వాటిలో సందేహాలేమాత్రం లేవు.

మరి శోభారాజులు ప్రాచుర్యంలోకి తెచ్చిన "అదివో! అల్లదివో"; "విన్నపాలు వినవలె"; "ముద్దుకారే యశోద" లాంటి కీర్తనల్లోనే యెందుకు సందేహాలు వస్తున్నాయి? గరిమెళ్లవారుగానీ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గానీ, లతా మంగేష్కర్ గానీ, మంగళంపల్లి గానీ--తమకి అందుబాటులో వున్న "సాహిత్యానికి" ట్యూన్లు కట్టి, వీనులవిందుగా పాడారేగానీ, ఆ సాహిత్యాన్ని "ప్రశ్నించే" ప్రయత్నం చెయ్యలేదు! చాపక్రింది నీరులా, ఆ "సాహిత్యమే" వ్యాపించి, పూజలందుకొంటోంది!

నాకు తెలిసీ, తెలుగు సాహిత్యంలో విశ్రాంతి యెరుగకుండా, అలుపన్నది లేకుండా, (తనకి అంత సమయం యెలా వచ్చేదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే!)  కృషి చేసినవాడు "ఆరుద్ర!" ఆయన "సమగ్రాంధ్ర సాహిత్యం", "నిఘంటువు", "వేమన్న వేదం" లాంటి యెన్నో "బృహద్గ్రంధాలని" వ్రాశాడు. (నేనేమీ ఆరుద్ర అభిమానిని కాదు. ఇంకా అంటే "కె రా" అభిమానిని!).

వుదాహరణకి, ఆయన వ్రాసిన వేమన్న వేదంలో ప్రతీ పద్యానికీ, "మదరాసు ప్రాచ్య లిఖిత భాండాగారం" లోని 54 సంపుటాలలో వున్న పద్యాలనే "ప్రామాణికంగా" తీసుకొన్నాడు. పైగా, వాటిని "బ్రౌన్ దొరగారు" సేకరించిన పద్యాలతోటీ, ఆయన నిఘంటువులోని పద "అర్థాల"తోటీ బేరీజు వేస్తూ, ఆయన రచన కొనసాగించాడు. వుదాహరణకి లలితగారు తమ ఆంతర్యంలో పెట్టిన, అంతర్జాతీయంగా ప్రతి తెలుగువాడూ ఇప్పుడు అదే సరియైనది అనుకుంటున్న "అనువుగాని చోట" పద్యం తీసుకొంటే, వేమన వ్రాసిందీ(?!), ఆరుద్ర చెప్పిందీ--అసలు పద్యం.......

"అనువుగానిచోట నధికులమనరాదు, యొదిగి యొక్కవంక నుండవలయు, మర్రియాకుపైన మాధవుడుండడా? విశ్వదాభిరామ వినురవేమ!"

ఇదీ అసలు పాఠం! (ఇలాంటివి కొన్నివేలున్నాయి--శ్రధ్ధ పెడితే!)

(అప్పట్లో తమిళనాడుని "మదరాసు" రాష్ట్రం అనేవారు. దాని ముఖ్యపట్టణం (నేటి చెన్నై) ని కూడా "మదరాసు" అనే అనేవారు. ఆరుద్ర చెప్పిన "ప్రాచ్య లిఖిత భాండాగారం", తంజావూరులో నెలకొన్న "సరస్వతి మహల్" వొకటేనో వేరువేరో నాకు తెలీదు).

కానీ, "వెయ్యేళ్ల ప్రాచీన భాష" గా తెలుగుని గుర్తించి, కేంద్రం ఇచ్చిన యెన్నో కోట్లతో మనం యేమి చేశామో? కనీసం ఆ ప్రాచ్య లిఖిత భాండారాల్లోనుంచి మన "తెలుగు" కి సంబంధించిన "తాళ పత్రాలనీ", ఇతర "అముద్రిత" గ్రంధాలనీ మన "రాష్ట్రానికి" తెచ్చుకున్నామా? కనీసం ప్రయత్నం చేశామా?

అమెరికలో "తానా" మహాసభలూ, ఇంకేవో (చిట్టెన్ రాజుగారన్నట్లు 'తంతా') సభలూ వగైరా నిర్వహిస్తున్నాం. కానీ, "యెవరాతల్లి? యెవడికి తల్లి?" అన్నవాణ్ని యేమంటాము?

......తరువాయి మరోసారి.