Sunday, March 11, 2012

వేదికలపై......



......వాక్ప్రవాహాలు

మీరెన్నయినా చెప్పండి......అతి సర్వత్ర వర్జయేత్!

ఈమధ్య అనేక సభలూ, సమావేశాల్లో, సన్మానాల్లో, వివిధ కార్యక్రమాల్లో మనం చూస్తూనే వున్నాము. స్వడబ్బాలు అంతగా లేకపోయినా, పరడబ్బాలూ, పరస్పర డబ్బాలూ యెక్కువై పోయాయి.

ప్రతీ వ్యక్తీ తన జీవితకాలంలో తగిన సాఫల్యం చెందాలనే తన ప్రయాణం ప్రారంభిస్తాడు. 

ఓ కళాకారుడైనా, కవీ, రచయితా, సినీ కవీ--ఇలా యెవరైనా అందుకు కఠోర దీక్షతో శ్రమిస్తారు. కానీ కొంతమందికే "సాఫల్యం"......యేదో ఒక రూపంలో లభిస్తుంది.

వుదాహరణకి, పింగళీ, ఆత్రేయా, వేటూరీ, సిరివెన్నెలా.....ఇలా అందరూ కొన్ని వేల పాటలు వ్రాశారు. ఫలానా పాటకి ఫలానాది స్పూర్తి...అని కూడా ప్రకటిస్తూ వుంటారు. 

వాళ్లు వ్రాసిన పాటల్లో నిజంగా "మంచి పాటలు" ఒక శాతం కూడా వుండవు. సమీక్షకులూ, విమర్శకులూ, సాహితీ బంధువులూ వగైరాలూ, వారి వెనుక జనసామాన్యం "మంచిపాటలు"గా గుర్తించినవి ఓ 2 నుంచి 3 శాతం వుండొచ్చు. 

రికార్డు కంపెనీలూ, క్యాసెట్ కంపెనీలూ, ఇప్పుడు సీడీ/డివీడీ కంపెనీలూ "హిట్"లుగా చెప్పేవి ఓ 5 శాతం వుండొచ్చు. 

కానీ, మిగిలిన వాటి సంగతేమిటీ? ఆ మాత్రానికి....అంత అవసరమా?  

ఆవేశంలో వచ్చినట్టే, వుద్వేగంలో మాటలొచ్చేస్తాయి-- 

సంతోషం ప్రకటించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, పొగడ్డానికి--ఇలా ప్రవాహంగా వచ్చేస్తూ వుంటాయి!

మనసులో యేర్పడుతున్న ఆలోచనల గొలుసుకట్టుని వెంటవెంటనే మాటల్లోకి మార్చుకొని, చక్కగా వారి భావాలని శ్రోతలకి, మనసుల్లోకి చొచ్చుకొనిపోయేలా చెప్పడం అనేది--పుంభావ సరస్వతులకి మాత్రమే సాధ్యం!

కాళా తపస్వులకీ, ఎస్పీ బాలు లాంటివాళ్లకీ, సిరివెన్నెల లాంటి వాళ్లకీ, సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల--ఇలా చాలా మందికి అది వుగ్గుతో అబ్బిన విద్య.

కానీ.......

అక్కడే సంయమనం అవసరం. 

చూసేవాళ్లకీ, వినేవాళ్లకీ "అంతుందా?" అనిపిస్తే, మీ నటన (అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్) యేమి సాధించినట్టు?

ఎస్పీ ఈ మధ్య కొంతవరకు సంయమనం పాటిస్తున్నాడు....ఇంతకన్నా నేను ఇంక యెక్కువ మాట్లాడను....అనేస్తున్నాడు. 

రెండు సంవత్సరాలుగా, శివరాత్రిరోజున, "పాడుతా తీయగా"కి తనికెళ్ల భరణి ని ఆహ్వానించి, ఆయన "తుస్....బుస్....ఖస్....శంకరా" అంటూ చదువుతున్న కవితలని బాగా మోసేస్తున్నాడు. సందేహం లేదు--భరణి అలౌకిక ప్రజ్ఞ కల కవీ, రచయితా. 

కానీ......

"హూష్.....
స్పేస్........
సుభాష్...
చంద్రబోస్ లా.....

అంతా ఖామోష్!"

ఇది వ్రాసిందెవరో గుర్తొచ్చిందా?

మరెందుకీ శషభిషలు?

"ఆయన నాకు తండ్రితో సమానం...వాడిక్కూడా తండ్రితో సమానం అంటున్నాడుకాబట్టి, వాడు నాకు సోదరుడితో సమానం....." ఇలా భాషణం సాగాల్సిన అవసరం వుందా?

పెద్దలు నామాటలని "విమర్శగా" కాకుండా, ఓ సలహాగా స్వీకరిస్తే సంతోషిస్తాను. 

ముఖ్యంగా......ఇలాంటివాటివల్ల కొన్నివర్గాల ప్రేక్షకులనీ, శ్రోతలనీ, సామాన్య జనాన్నీ దూరం చేసుకొంటున్నారని గమనిస్తే......ఇంకా సంతోషం!

గ్రహించండి.