Saturday, December 4, 2010

పాపం ఆవిడెవరో....

.......యెందుకో?

క. ననునెవ్వతిగాజూచితి
    వనియంతర్భాష్పయగుచు నవనత ముఖియై
    ఘనతర గద్గదికా ని
    స్వనమున మఱిమాటలాడ శక్యముగామిన్.

ఉ. ఈసున బుట్టి డెందమున హెచ్చినశోకదవానలంబు చే
     గాసిలి యేడ్చె బ్రాణవిభుకట్టెదుటన్లలితాంగి పంకజ
     శ్రీసఖమైన మోముపయి జేల చెఱంగిడి బాలపల్లవ
     గ్రాసకషాయకంఠ కలకంఠ వధూకలకాకలీ ధ్వనిన్.

                                                   అర్థ సందర్భాలూ, తాత్పర్యం యెవరైనా చెపుతారా?

Saturday, September 25, 2010

తల్లులు

పాకీవాళ్లు


'పాకీపిల్ల 'వటంచు నిన్ను నిరసింపజూతురమ్మా స్వయం
పాకస్వాములు కొంతమంది, ఇది యే పాపంబో! మూన్నాళ్లలో
నే కన్నులు తలకెక్కి వెన్‌క గనరీ నిర్భాగ్య దామోదరుల్
పాకీదేగద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ!

వృత్తి ధర్మం గా పారిశుధ్య పని చేశేవాళ్లని 'పాకీ వాళ్లు ' అని ఈసడించుకుంటే, ప్రతీవాడి తల్లీ పాకీదే కదా? అని ప్రశ్నించాడు కవి "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి!

మా చిన్నప్పుడు స్కూల్లో, ప్రక్కవాడిని నువ్వు చిన్నప్పుడు పాకేవాడివా? దేకేవాడివా? అనడిగి, పాకేవాణ్ని అని వాడు సమాధానం చెప్పగానే--యేయ్! వీడు పాకీవాడట! అని వెక్కిరించేవాళ్లం!




Saturday, August 7, 2010

అవధానాలు

దత్తపది

క్రికెట్ వీరులు జడేజా, ద్రావిడ్, కాంబ్లీ, కుంబ్లే పేర్లతో, రామాయణార్థం లో చెప్పమంటే--సంస్కృతం లో

ఏషా జడేజా వికటాని హన్యా, తద్రావిడేఢ్యా జలధి 
ప్రసిధ్ధాన్ తద్వానరో.....కాంబ్లీతి కుంబ్లే రవంచకారా

అని చెప్పారుట.

అంటే, హనుమంతుడు లంకను ప్రవేశించబోయినప్పుడు సిం హళ కోట ద్వారం వద్ద కాపలాగా వున్న సిం హిక అనే రాక్షసిని హనుమంతుడు ముష్టిఘాతాలతో చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ రాక్షసి "కాంబ్లీ--కుంబ్లే" అంటూ ఆర్తనాదాలు చేసిందట!

Thursday, July 1, 2010

ఇదెక్కడిదో!

గుర్తు చెయ్యండి

"అంజనాచల గర్వ భంజనాచల లీల నీలి వర్ణపు మేని డాలు తనర....."

దీన్ని పూర్తి చెస్తారా?

Wednesday, May 26, 2010

సహజకవి

‘వేటూరి…..

….సుందర రామ్మూర్తి'…..ఇకలేరు!

గొప్ప కవి ఆయన—యెందుకంటే—అర్థం లేని అలతి అలతి పదాలతో, గొప్ప గొప్ప సినిమా పాటలు వ్రాసేశాడు.

గొప్ప కవిత్వం వ్రాశాడు ఆయన—కానీ దాన్ని ఖూనీ చేసి, ఆయన వ్రాసిన సినిమాకికాకుండా వేరే సినిమాలో చిత్రీకరించి, ఆయన వ్రాసిన సన్నివేశానికి కాకుండా, వేరే సన్నివేశం లో చిత్రీకరించి, ఆయన వ్రాసిన వరుస(క్రమం)లో కాకుండా వేరే క్రమం లో చరణాలని మార్చేసి చిత్రీకరించి—కళాఖండాలు నిర్మించారు కళా తపస్వులు!

ప్రముఖ ‘కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం (అన్నీ)’ చేసేవాళ్ళకి ‘ఘోస్ట్’ గా వ్రాసిన పాటల దగ్గర నించీ, ఆయన మంచిపాటలే వ్రాశాడు.

కాని నాకుమాత్రం, మొహమాటం లేకుండా చెపుతున్నా—వ్రేళ్ళ మీద లెఖ్ఖ పెట్ట దగినన్ని పాటలే నచ్చాయి! (సినిమాలలో వచ్చినవి!)

‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ…..’ ఆయన వెళ్ళాడనీ, అక్కడైనా చక్కని కవిత్వం వ్రాసుకుంటాడనీ, ఆశిస్తాను.

Wednesday, May 5, 2010

పద్యసాహిత్యం

ఆణిముత్యాలు

"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్పవింటివో! కలనైనన్ రఘూద్వహుడు కానలలోనను త్రోయబంచునే?"

ఈ పద్య పాదం కంకంటి పాపరాజు వ్రాసిన 'ఉత్తర రామ చరిత్ర' లోది.

పాపరాజు చక్కటి తెలుగులో ఖండకావ్యాలూ, కావ్యాలూ వ్రాశారు. 

సన్నివేశం--లక్ష్మణుడు, సీతని గర్భవతిగా వున్నప్పుడు, రాముడు ఆవిడ కోరిక ప్రకారం వనసీమలలో విహారానికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్పి, అక్కడికి చేరాక, చావుకబురు చల్లగా చెప్పాడు--అక్కడ వదిలేసి రమ్మన్నాడని.

అప్పుడు ఒక్కసారిగా షాక్ తిన్న సీత, ఆ షాక్ లక్షణాలని లక్ష్మణుడికి ఆపాదిస్తూ, 'నువ్వే కలవరపాటు తో ఇలా చెపుతున్నావో? లేక ఆయన చెప్పిన మాటలు పరాగ్గా వుండి యేమి విన్నావో! కలలోనైనా, రాముడు నన్ను అడవుల్లో త్రోయమని పంపిస్తాడా!' అని ప్రశ్నిస్తుంది సీత.

ఆవిడకెంత నమ్మకమో రాముడి మీద--పిచ్చి తల్లి!

పద్యం పూర్తిగా గుర్తుకి రాలేదు--యెవరూ పూరించలేదు!

సరే.

"రంతుల్ మానుము కుక్కుటాధమ......ఉలూఖల.....తండులముల్...."

యెవరైనా పూరించగలరా?

Tuesday, April 13, 2010

పద్య సాహిత్యం

ఆణిముత్యాలు

'గండరగండడై యలవు గండను మెండుగ తాండవింప.......' అనే పద్య పాదం "పలనాటి వీర చరిత్ర" అనే పద్య కావ్యం లోనిది. యుధ్ధం లో బాల చంద్రుడి పరాక్రమాన్ని వర్ణించేది.

వ్రాసిన వారు కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి గారనుకుంటా.

ఆయన 'పాంథశాల' కి వచ్చినంత ఫేం మిగిలిన కావ్యాలకి వచ్చినట్టులేదు.

పద్యం యెవరైనా పూర్తిగా ప్రచురిస్తే, సంతోషిస్తాను.


ఇంకో పద్య పాదం......

"కళవళమొంది తెలిపితివొ, కాక పరాకున తప్ప వింటివో, కలనైనన్

రఘూద్వహుడు కానలలో నను త్రోయబంచునే?"

ఈ పద్యాన్ని పూరిస్తారా యెవరైనా?

Sunday, April 4, 2010

అవధానాలు

సంగీతావధానం

శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర సంగీతావధాని. 

ఈ అవధానం లో అష్టావధానం లాగానే పృచ్చకులు దత్తపది, సమస్య లాంటి ప్రశ్నలు వేస్తే, వాటిని చందోబధ్ధం గా పూరిస్తూ, ఓ రాగం లో బాణీ కట్టి, ఆలపించాలి.

ఇందులో యాచేంద్రని మించినవారు లేరు. ఇంకెవరైనా అభ్యసిస్తున్నారో లేదో తెలియదు.

శ్రీ యాచేంద్రకి ఓ సారి దత్తపది లో 'కోకో' 'వాలిబాల్' 'కబాడి' 'క్రికెట్టు' అనే ఆటల పేర్లతో దత్తపది ఇచ్చి, భక్తి భావం తో పూరించమన్నారు.

ఆయన పాడిన తీరు గుర్తుంది గానీ సాహిత్యం పూర్తిగా గుర్తు లేదు. సమస్యని ఆయన సాధించిన విధం మాత్రం హృదయానికీ మనసుకీ హత్తుకొని వుండి పోయింది.

అది.......

"యెందుకో కోదండరాముని......."

"....తల్లి వొడిలో వాలి బాలునివలె........"

"......గీతిక బాడి........."

"చక్రికెట్టుల..............."

ఇలాగ!

ఇది వొక ప్రశంసనీయ ప్రక్రియే. ఇంకెవరైనా తర్ఫీదు చెందితే బాగుండును.

Monday, March 22, 2010

సాహిత్య ప్రక్రియ

అవధానాలు

పందొమ్మిదో శతాబ్దం నుంచీ ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకూ రెండురకాల అవధానాలు ప్రసిధ్ధమైనవి—అష్టావధానం, శతావధానం.

వీటి గురించి అందరికీ తెలుసు. ఆష్టావధానం అంటే, యెనిమిది మంది పృఛ్ఛకులు అవధానిగారిని యెనిమిది విషయాల్లో ప్రశ్నించేవారు. కొన్ని చోట్ల కొన్ని అంశాలు మార్చినా, యెనిమిది మంది పృచ్చకులూ మారలేదు.

ఉదాహరణకి—దత్తపది; వ్యస్థాక్షరి; నిషిధ్ధాక్షరి; సమస్యా పూరణం; వర్ణన; కావ్య పఠనం; ఘంటా గణనం; తేదీలు చెప్పి వారం అడగడం; ఆశువు—ఇంకా అప్రస్తుత ప్రసంగం—ఇలా వుండేవి.

ఇక శతావధానం అంటే, ఓ వందమంది పృఛ్ఛకులకి, వారడిగిన ఛందస్సులో, వారడిగిన విషయం పై, మొదటగా అందరికీ మొదటి పాదం, మళ్ళీ మొదటివారి దగ్గరనించి రెండోపాదం—అలా నాలుగు పాదాలూ పూరించడమే కాకుండా ఆఖర్న ఆ వంద పద్యాలూ ఒకదాని వెనుక ఒకటి మళ్ళీ పూర్తిగా చెప్పడం!

ఈ ప్రక్రియల్లో అనేకమంది ప్రజ్ఙ్ఞావంతులున్నా, ప్రత్యేక స్థానం తిరుపతి వెంకట కవులది. (వీరు సాహిత్యం లో బహుముఖ కృషి చేశారు. కథలూ, కావ్యాలూ, నాటకాలూ, వ్యాసాలూ, విమర్శలూ—ఇలా అనేక ప్రక్రియల్ని ప్రతిభావంతం గా నిర్వహించారు.)

ఇక తరవాత విషయానికొస్తే, అష్టావధానాలు—ద్విగుణిత, త్రిగుణిత, చతుర్గుణిత—ఇలా పృఛ్ఛకుల సంఖ్యా, విషయాలూ పెంచి, అవధానాలు నిర్వహించిన వారున్నారు.

శతావధానాల్లో, సహస్రావధానులు వచ్చారు.

కొత్తగా, నాట్యావధానం; సంగీతావధానం; నేత్రావధానం—ఇలా కొత్త ప్రక్రియలు చేపట్టి, ప్రతిభావంతం గా ప్రదర్శించినవారున్నారు. కానీ ఇవి అంత ప్రాచుర్యం పొందినట్లు లేదు.

ఆష్టావధానుల విషయానికొస్తే, మేడసాని మోహన్; కవితా ప్రాసాద్; గరికపాటివారూ, కట్టమూరివారూ—ఇలా అనేకమంది ప్రసిధ్ధులు.

శతావధానుల్లో, కడిమెళ్ళవారు ‘సహస్రావధాని ‘

యెటొచ్చీ మిగిలిన వాటిల్లోనే ఒకళ్ళిద్దరు తప్ప యెవరూ ప్రసిధ్ధులవలేదు—ఇప్పుడెవరూ వాటిని సాధన చేస్తున్నవాళ్ళు వున్నట్టు కనపడదు.

నేత్రావధానం తీసుకొంటే, ఇద్దరు ‘సిస్టర్స్ ‘ అలవోకగా చేశేవారు. పృచ్చకులు ఇచ్చిన సందేశాన్ని ఒకామె తన నేత్రాలతో సైగలు చేస్తూంటే, కొంతదూరం లో వున్న రెండో ఆమె ఆ సైగల్ని గ్రహించి, ఆ సందేశాన్ని యథాతథం గా వ్రాసి, అందర్నీ ఆశ్చర్యపరిచేది.

బోయ్ స్కౌట్స్/గైడ్స్ లో జెండాలతో ‘సిగ్నలింగ్’ నేర్పించేవారు. అది మోర్స్ కోడ్ లాంటిది.

మరి నేత్రావధానానికి మోర్స్ కోడ్ కీ యేమైనా సంబంధం వుందోలేదో నాకు తెలియదు.

తరవాతది, నాట్యావధానం. అంటే ‘నటన ‘ లో అవధానం. ప్రసిధ్ధులు ధారా రామనాథ శాస్త్రి సోదరులు ప్రతిభావంతం గా నిర్వహించేవారు.

ప్రక్రియ యేమిటంటే, పృఛ్ఛకుల్నించి యేదైనా సన్నివేశం ఆహ్వానించి, సమస్య ఇచ్చిన 15 నిమిషాల లోపల—ఆహార్యం, వాచికం, సంగీతం—ఆశువుగా నిర్వహిస్తూ, ఆ సన్నివేశాన్ని నటించి చూపించేవారు!

పృఛ్ఛకుల్ని వీలైనంత వెరైటీ చూపించమనేవారు—ఒకరు పౌరాణికం; ఒకరు సాంఘికం; ఒకరు చారిత్రకం; ఒకరు జానపదం—ఇలా సన్నివేశాలనిమ్మని.

ఉదాహరణకి, ‘శాపగ్రస్తుడైన కర్ణుడి చావు ‘—ఒకరు కర్ణుడు, ఒకరు అర్జునుడు; గురజాడవారి గిరీశం, మొక్కపాటివారి బారిష్టరు పార్వతీశం కలుసుకొంటే, యెలా వుంటుంది (ఒకరు గిరీశం, ఒకరు పార్వతీశం); కళింగ యుద్ధం అయిపోయాక, అశోకుడూ, బుధ్ధుడూ (వివరించక్కర్లేదుకదా—యెవరెవరో?)—ఇలా!
మేమిచ్చిన కర్ణుడి సన్నివేశం లో, పొరపాటున ఆయన కొంచెం గట్టిగా మొత్తుకోగానే, ఓ కర్ణాభరణం జారి పడిపోయింది!

ఆయన డైలాగు—‘ఆహా! నా కర్ణాభరణము నేలవ్రాలుట కూడ అశుభమునే సూచించుచున్నది! హా! హతవిధీ! అన్నిశాపములతోను, నా విధికూడ నన్ను వెక్కిరించుచున్నదికదా! అర్జునా! ఆగుము! నిస్సహాయుని వధించుట వీరత్వమనిపించుకోదు!’

ఇంకేమి చెప్పాలి?

ఇక సంగీతావధానం గురించి మరోసారి.

Tuesday, March 16, 2010

దైవదత్తం

పుంభావ సరస్వతి

సరస్వతిదేవి కళలకి కాణాచి. ఆమెని పురుషుడిగా భావిస్తే, ఆ వ్యక్తిని పుంభావ సరస్వతి అంటారు.

అలాంటివాళ్ళలో మొదటివాడు కాళిదాసు!

రెండోవాడు మన గరికపాటి నరసిం హా రావు! ఇవాళ ఓ చానెల్లో ఆన్ లైన్ అష్టావధానాన్ని అలవోకగా నిర్వహించాడు!

యెంతమందినో అవధానులని చూశానుగానీ, ఇలా అలవోకగా నిర్వహించేవాడు ఈయనే!

ఓం హ్రీం క్లీం ఐం లం యం.....వీటిని బీజాక్షరాలు అంటారు.

ఈ బీజాక్షరాలతోనే మంత్రాలు మొదలవుతాయి--దైవపూజకైనా, క్షుద్రపూజకైనా.

కాళిదాసు తన భార్యా పిల్లలతో కాళికాలయం లో ఆశ్రయం పొందుతూ, తన అపాండిత్యాన్ని అందరూ హేళన చేస్తే, భార్య కూడా ప్రశ్నిస్తే, కాళిక విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకోబోతుంటే, కాళికాదేవి అతని నాలుక పై బీజాక్షరాలు వ్రాసిందట--అవేమిటో తెలియదుగానీ, అతను మహా కవి అయిపోయాడు.

ఓ సారి భోజరాజు ఆస్థానం లో పెద్ద సమస్య వచ్చి, నవరత్నాలలో యెవరు గొప్ప కవి, పండితుడు అనే పోటీ వచ్చినప్పుడు, స్వయం గా కాళికాదేవిని అడగడానికి వెళ్ళారందరూ.

అప్పుడు కాళికాదేవి 'కవిర్దండిః, కవిర్దండిః, భవభూతిః పండితః!' అందట.

కోపం వచ్చిన కాళిదాసు, 'కోహం రణ్డే?' అనడిగితే......

'త్వమేవాహం! త్వమేవాహం! న సంశయః!' అందట.

దండి కవి, భవభూతి పండితుడు అని చెప్పిన కాళికని, మరి నేనెవరినే రండా? అని కాళిదాసు అడిగితే, నువ్వే నేను, నేనే నువ్వు--అందట! 

అంటే, నేను రండనైతే, నువ్వూ అదే అనేకదా?

యెలావుంది?

Friday, January 8, 2010

సంపాదన


ఖర్చు


"రైదాసు" ఒక చర్మకారుడు.  


గంగానది ముందు ఓ చెట్టు క్రింద కూర్చొని, చెప్పులు కుట్టుకుంటూ జీవనం చేసేవాడు.  


ఉదయాన్నే డ్యూటీ యెక్కి, మధ్యాహ్న భోజన సమయం వరకూ, అక్కడే కూర్చొని, తన పని అయిపోగానే--భగవంతుడిమీద కీర్తనలు పాడుకొంటూ వుండేవాడుట.  


ఒక రోజు ఓ పెద్దాయన అతనిని 'నువ్వు రోజుకి యెంత సంపాదిస్తావు? దాన్ని యెలా ఖర్చు పెడతావు? ఈ పాటలు మానేస్తే, ఇంకా యెక్కువ సంపాదించుకోవచ్చు కదా?' అని అడిగితే--అతను ఇచ్చిన సమాధానం ఇది!  


'అయ్యా--నేను రోజూ నాలుగు రూపాయలు మాత్రమే సంపాదిస్తాను! ఆ నాలుగూ చాలు నాకు!  


అందులో ఒకటి నేను తింటాను--నాకూ, నా భార్యకీ ఆ రూపాయి సరిపోతుంది.  


రెండోది అప్పు ఇస్తాను--అంటే నా పిల్లలకి పెడతాను! నా వృధ్ధాప్యం లో మళ్ళీ వసూలు చేసుకొనే అప్పు అదే కదా?  


మూడోది అప్పు తీరుస్తాను--అంటే నా తల్లిదండ్రులకి పెడతాను--వారి ఋణం తీర్చుకొనే మార్గం అదే కదా?  


ఇక నాలుగోది నూతిలో పారేస్తాను--అంటే దాన ధర్మాలు చేస్తాను--పరలోకం లో పనికి వచ్చే పుణ్యానికి అదే మార్గం కదా?  


ఇంక ఖాళీగా వుడే సమయం లో ఆ పరమాత్ముణ్ణి కీర్తించుకొంటూ వుంటాను! అంతే!' అన్నాడట!  


అతనే తరవాత 'సంత్ రవిదాసు' గా ప్రసిధ్ధి పొందాడట!

Saturday, January 2, 2010

సంపాదన...

ఖర్చు


ఏక్ మైఁ ఖాతా, 
దూసరా ఉథార్ దేతా, 
తీసరా కర్జ్ చుకాతా, 
ఔర్ చౌథా కువేఁ మేఁ ఫేఁ క్ దేతా!  


దీని భావమేమి తిరుమలేశా?