Friday, December 23, 2011

చక్కని సాహిత్యం అంటే……

......ఇలా వుండాలి(ట)!


అనంతలక్ష్మి దేహంలో మనస్సులో నిర్మలత్వం ఉంది. రఘునాధరాయని హృదయ మహారాజ్యం ఆక్రమించి, చక్రవర్తియై రాజ్యమేలిన దివ్యసుందరి, భూమికి దిగివచ్చిన పరమాప్సరస సుందరి మధురవాణి అందమంతా ఈ బాలికలో ప్రత్యక్షమైంది. కొంచెం కోల, కొంచెం గుండ్రని మోము, అయిదడుగుల ఎత్తు, పొట్టి పొడుగుకాని ముక్కు, సమమైన కోలతనంలో దవడలో, బుగ్గలు ఫాలము ఏకరేఖా ప్రవాహ సామ్యం కుదిరి వుంటాయి. అలాంటి మోము గుంటలుపడే బుగ్గలు, కొంచెం పైకి తిరిగిన పై పెదవి, కొంచెం అంటే కొంచమే ఎత్తయిన క్రింది పెదవీ, సుడులుపడే సమ చుబుకమూ ఉండి, ఆ మోము కాసు బంగారం రంగు కలిగి, ఆ రంగుకు తగినట్లు లేత గులాబీ రాగం అప్పుడప్పుడా బుగ్గలకి ప్రసరిస్తూ ఉంటే, అలాంటి సౌందర్య నిధులన్నీ చేకూరినచోట, ఆ నిధులకు కిరీటంలాంటి కళ్ల అందం వెలసిందనుకొంటే, ఆ దివ్య సౌందర్యవదనం అనంతలక్ష్మిది. కాంచనమాలను, సుబ్బలక్ష్మిని, నళినీజయవంత్ ను ముగ్గురినీ కరిగించి పోతపోస్తే అనంతలక్ష్మి అవుతుంది.

ఆవును. అనేకమందికి చక్కని హృదయాలనన్నీ గబగబ పువ్వుపుణికినట్లు పుణికే శక్తిగల సౌందర్యపూర్ణమైన మోము ఉంటుంది. అంతే. ఆ మోముకు తగిన తలగానీ, తలకట్టుగానీ ఉండవు. ఆతి పెద్ద లంకగుమ్మడి లాంటి తలో, పొన్నకాయలా మెదడులేని తలో ఉంటాయి. ఆనంతలక్ష్మికి తలకట్టు, తోడిరాగాలాపన ఆమె కేశ సౌభాగ్యము. కేశరంజనివారి ప్రకటన చిత్రాల తలకట్టులకు పాఠాలు నేర్పుతుంది. 




……………

ప్రేమ అనే మహోత్తమ స్థితి మనుష్యుని జీవితంలో ఊరికేరాదు. భర్తతో స్నేహమూ, స్త్రీ పురుష సంబంధ ప్రీతీ సమ్మిశ్రితమై ఒకరకమైన ప్రేమగా పరిణమిస్తాయి. ఒకనాడాస్థితి సంపూర్ణ ప్రేమ కావచ్చును.

కాని అసలు ప్రేమే స్త్రీకిగాని, పురుషునికిగాని సంభవిస్తే, అది అమృత మహానది. సరస్సు కట్టలు తెగినట్లవుతుంది.



* * *

“ఆకలి అవుతున్నది గాని (జావ) సహించడంలేదు లక్ష్మీ!”
“మీ వంట్లో ఒక వీశెడు క్వినయిను ప్రవేశించింది. అందుకనేగాదండీ మిమ్మల్ని పళ్లరసం తెగతాగమంటారు డాక్టరు!”

“సరేలే! రెండుమూడురోజులలో పైత్యనాడి తిరగకపోతుందా ఏమిటి? తిరక్కపోతే పైత్తకారినే అయిపోతాను!”


“అయితే గురువుగారూ, మీరు ఎప్పుడూ అల్లా నవ్వువచ్చే మాటలు మాట్లాడుతూనే ఉంటారా?”

“నాకు ఏడుపు మాటలు చేతకావు. కృష్ణశాస్త్రిగారి శిష్యరికంచేసి ఇంత ఏడుపు కవిత్వం రచించడమన్నా నేర్చుకోవాలి!”
“నవ్వుకవిత్వం, ఏడుపు కవిత్వాలేగాని, ఇంకోరకం కవిత్వం తెలుగులో లేనేలేవా అండి?”
“లక్ష ఉన్నాయి. రాయప్రోలువారి ప్రియురాలే చెల్లెలు కవిత్వం, వేదులవారి పూవుల కవిత్వం, నండూరివారి పల్లెటూరి కవిత్వం, తుమ్మలవారి రైతు కవిత్వం, విశ్వనాథవారి ఎత్తుకొండల కవిత్వం, కాటూరి పింగళుల తేనేపెరడు కవిత్వం, కవికొండలవారి అటుకులు, జీడిపప్పు కవిత్వం, దీక్షితులవారి బువ్వాలాట కవిత్వం……”
“అదేమిటండీ! ఒకటడిగితే ఇరవై చెబుతారు ఇంతనీరసంగా ఉన్నారు కూడా?”
“ఈలా మాట్లాడుతూ ఉంటే, కాస్త జావకూడా సయిస్తుంది. ఇంకో వెండిగిన్నెడు జావా, దానితోపా సాతుకుడిరసం ఒక పెద్ద గ్లాసుడూ పట్టుకురా అనంతయ్యగారూ!”



……….


ఆమె పరుగెత్తుతూ ఉంటే ఆమె దేహ సౌష్టవచంద్రిక వెన్నెల కురుస్తుంది అనుకొన్నాడు…..ఎక్కడా అపశ్రుతిలేని శరీరాంగ నిర్మాణం ఈమెలో చేతులూ, వక్షనిధులు, నడుము, కటి, కాళ్లు, పాదాలు బ్రహ్మదేవుడు దివ్యలలిత కళాపారవశ్యకతతో సృషించి ఉంటాడనుకున్నాడు. ఆందమైన బాలికలు ఉండడమే లోకానికి ఆపత్తు. ఆందం సూదంటురాయి. మగవాళ్లు అనే ఇనుప శకలాలను ఆకర్షిస్తే ఏలాగు తనబోటి దద్దమ్మల బ్రతుకు!
(అంతలో కాస్త చరిత్ర)

"డాక్టరు రంగనాయకులు రష్యా ప్రియుడు, కమ్యూనిస్టువాది. కాంగ్రెసులో పనిచేసి దేశంలో ఉన్న శక్తులను కాంగ్రెసు కట్టుకురాలేకపోతున్నదని, అహింసా వాదమువల్ల ఎదుటివాడి హృదయం మార్చడం అనే ఆశయం ఉద్భవం అవుతుందనీ, ఈలోగా తిండిలేక మాడిపోతూ ఉంటారు ప్రజలు అనీ నిర్ధారణచేసుకున్నాడు. ఆచార్య నరేంద్రదేవు, జోషీ, జయప్రకాష్ మొదలగువారి వాదనలు నచ్చాయి. ఆ రోజుల్లో కాంగ్రేసు ఎడమచేతి వాదన వారుండేవారు. వారు కాంగ్రెసు సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనీ.

జోషి మీరట్ కేసులో ఉన్నాడు జైలుకి వెళ్లాడు. ఆ సందర్భంలోనే ఆ తర్వాతనే జోషి, డాంగే మొదలగువారు కమ్యూనిస్టులుగా ఉండి రహస్యంగా సామ్యవాదాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. వారిలో చాలామంది కాంగ్రెసు సభ్యులే.

ఫ్రభుత్వం కమ్యూనిస్టు సంఘాలను నిషేధించింది. ఆ కారణం చేత కమ్యూనిస్టులు కాంగ్రెసులోనే ఉండి పనిచేస్తూ వుండిరి.
జయప్రకాష్ నారాయణ్, మెహరల్లీ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైనవారంతా కాంగ్రెస్ లో సోషలిస్టులుగా (సాంఘికవాదులుగా) ఉండేవారు.
డాక్టరు వీరి వ్రాతలు చదివేవాడు. బోల్షివిజం ను గురించి చదివేవాడు. 1928లోనే పరీక్ష పూర్తిచేసి, 1930లో మదరాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. ……1930లో కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభించింది. 1931 తిరిగి వచ్చింది. మళ్లీ 1932 కాంగ్రెసువారినందరినీ కారాగారాలలో బంధించారు. కాని చాలా మందిని ప్రభుత్వంవారు లాఠీ ప్రయోగం చేసి మాత్రం వదులుతూ ఉండేవారు.........."
(అవునా?)


Saturday, December 3, 2011

మన సినీ సాహిత్యం



ఓ.......కోలవెరి!

ఈ మధ్య "త్రీ" సినిమా కోసం కుర్రాళ్లు ట్యూన్ చేసి పాడిన కోలవెరి పాట ప్రపంచ వ్యాప్త హిట్ అయి, అందరినోళ్లలోనూ నానుతోంది!

అందులో యేమిటీ గొప్పతనం? గొప్ప సాహిత్యం వుందా? గొప్ప సంగీతం వుందా? గొప్ప వాయిద్యసహకారం వుందా? మరేమిటి?

శంకరాభరణం శంకర శాస్త్రి "బ్రోచేవారెవరురా" గురించి అన్నట్టు--"ఆ కీర్తన అణువణువులోనూ 'ఆర్ ద్రత' నిండివుంది దాసూ!"--అదీ సంగతి.

కొన్ని నెలలుగా గుళ్లలో వినిపిస్తున్న పాటలని--ఈ మధ్య కుర్రపిల్లలు విడుదలచేశారని పేపర్లలో మెచ్చుకొంటున్న "......పూజలు" సిరీస్ సీడీల్లాంటివేమో అనుకున్నాను. 

పెద్దల బ్లాగులు చదవగా తెలిసింది అవి "శ్రీరామ రాజ్యం" సినిమాలోవని!

లవకుశ పాటలన్నీ ఇప్పటికీ హిట్ గా  యెందుకున్నాయి, ఈ పాటల ఆయుర్దాయం యెంత అని యెవరైనా ఆలోచిస్తే......నిజం తెలీదూ?

పైగా, పాటల రచయితల "స్వకుచమర్దనం" ఒకటీ! ఆపాటకి స్ఫూర్తి...అలా...అంటూ!

ఇప్పటి చిన్నారులకి పద్యాలు వినిపిస్తే మీచేతులు కొరికి పారిపోతున్నారా? వాటి అర్థం మీకే తెలీదుకాబట్టిగానీ, ఇది వరకు మా చిన్నారులకి మేము వినిపించలేదా? వాళ్లు మా చేతులు కొరికి పారిపోయారా? 

"శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా....." అంటే వాళ్లకి అర్థం కాదు అని మీరు నిర్ధారిస్తే, అది యెవరి తప్పు? 

అదీ తెలీకపోతే, "నాదు జపము తపమూ, నా కావ్యమే వృధా"!