Sunday, July 12, 2020

సాహిత్యం -- గ్రంథాలూ

బుచ్చి బాబు కథలు--
ఆ ఉ ఓ లు
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈతాకుల చాపమీద పరిచి వున్నాయి. మధ్యన ఒక గల్లాపెట్టెలాంటిది వుంది. గజం దూరం లో ఎలక్త్రిక్ దీప స్తంభం, మడిచేసిన ఒక గొడుగు, మిగతావి పాత పుస్తకాలు. అవన్నీ నిజంగా పాత పుస్తకాలే. పాతవే కాదు, ప్రాచీనమైనవి కూడా. అన్నీ తెనుగు గ్రంథాలే. కొన్నింటికి అట్టలే లేవు, పమిటకొంగులేని చీరలా; కొన్నింటికి మధ్యకుట్టిన కంతలు తప్ప దారం లేదు. కొన్ని తుదిమొదళ్లు లేని, పుస్తక కళేబరాలు. కొన్నింటి పుటలు, కదిపితే్ పొడుం గా విడిబోతున్నాయి. కొన్నింటిలో అచ్చు కనిపించడం లేదు. మరికొన్ని లెదర్ బైండింగ్ లో వున్నా-యమధర్మరాజు చర్మం లా వాటి లోపల పుటల్లో సాలీళ్లు, బొద్దింకలు, నెమలీకలు, ఈగలు, దోమలు వీటి కళేబరాలు, పురావస్తు పరిశోధకుడికి పిచ్చెత్తించేవిగా వున్నాయి. ఎండకి ఎండి, వానకి తడిసి, కొనవూపిరితో పడి వున్నాయి చాలా పుస్తకాలు. అక్కడవున్న కొన్నిపుస్తకాల పేర్లు--'ముకుంద విలాసము', కస్తూరి రంగకవి 'సాంబ నిఘంటువు', బహుజనపల్లి సీతారామాచార్యులుగారి 'ప్రసన్న పారిజాతము', 'అలఘు కౌముది' అందమైన పేరు. మంత్రిప్రగడ భుజంగరావుగారి 'ఉత్తరరామ చరిత్ర', ఆ పెద్ద పుస్తకం క్రింద కన్నుమీటుతున్నది దాసు శ్రీరామ పండితులవారి 'తెలుగునాడు' అన్న కావ్యం. పుటలు తిప్పి చూశాను. బ్రాహ్మణశాఖలు మాట్లాడే వ్యవహారికాన్ని అనుకరిస్తూ 'అవ్షే', 'సూస్సివషే', 'బలే చౌడషే', 'కాదషే' లాంటి ఉదాహరణలున్నట్లు ఇప్పటికీ ఙ్ఞాపకమే.

ఆంగ్లకవి విలియమ్‌ కూపర్ రచించిన జాన్‌ గిల్పిన్‌ అను హాస్య కావ్యానికి 'దుర్మార్గ చరిత్రము' అన్న తెలుగు అనుసరణ నన్నాకర్షించిన మరో పుస్తకం. దౌల్తాబాదు హనుమాయమ్మగారి 'మన్వంతరము', గంగతపల్లె శంకరరావు గారి 'భారత సారము' అను గద్యము, గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు అబ్రహమ్‌ లింకన్‌ గూర్చి వ్రాసిన 'విస్మృత రాజకవి' అను గ్రంథం. 'వైశాఖ' పత్రికలు--బైండు చేసిన సంపుటాలు, అవటపల్లి నారాయణరావుగారి 'విశాలాంధ్రము' సీరము సుభద్రమ్మగారి నవల 'జాగిలం' ఇంకా 'త్రిపురాంతక శతకం', 'కాశీమజిలీలు' మూడవ భాగం. నాకు ఙ్ఞాపకం ఉన్నంతవరకూ ఇలాంటివి అక్కడున్న పాతపుస్తకాలు. అవన్నీ యాభై అరవై ఏండ్లనాటి పుస్తకాలు. వాటినిగురించి నాకేమీ తెలియదు. వాటిల్లో దేన్నీ నా జీవితం లో చదవను. కాని అవి ఉన్నాయని తెలుసుకుని వాటి వెనకవున్న తెలుగు సాహితీ సంప్రదాయాన్ని తల్చుకుని ఆనాటి రచయితల్ని అభినందించకుండా ఉండలేను. ఎన్నో చెత్తపుస్తకాలు వస్తేనేగాని, ఒక మంచి పుస్తకం రాదంటారు. సమకాలిక గ్రంథాల విలువల పరిశీలనకి అవి గీటురాయి. కాని వాటిని చెత్తపుస్తకాలు అనడానికి కూడా నాకు అర్హత లేదేమో.ఆ పుస్తకాలలో వస్తువుమీద, అవి వ్రాసిన వారిమీదా మనస్సు పోవనారంభించింది. ప్రస్తుతాన్నుండి, వెనకటి రోజులకు పారిపోవాలనిపిచింది. నాకా ఊళ్లో కర్మాగారాలు, విద్యుత్ దీపాలు, మరలు, లారీలు, సిమెంట్ కట్టడాలు నచ్చలేదు. బాల్యం లో నే ఎరుగున్న చెరువులో తామరాకులు, కాలవలో గేదెలని కడుగుతూ గేదెపై స్వారీచేస్తూ పాడుకుంటున్న పశువులకాపరీ శ్రీరామనవమినాడు పందిట్లో హరికథలూ, మర్రిచెట్టుక్రింద పల్చటి చందమామ ఆకులమధ్య కనబడుతూ, ఇలాయిబుడ్ల వెలుగులో ప్రాణాలుతోడే వూపుతో సాగే గొల్లసుద్దులూ, చల్లటి పూరిపాకలు, తరవాణి కుండలూ, చెట్లనీడలో పొడుం పీలుస్తూ పెద్దల చదరంగపుటెత్తులూ నాకవే ఇష్టం. ఆ జీవితం ఆ పుస్తకాల్లో ఉంది . పాత పత్రికల సంపుటాల్లో గోదావరి మీద వంతెన వేయడం, మొదటి రైలు వెళ్లడం వార్త చూశాను. గతానికీ నాకు లంకె ఆనాటిపుస్తకాలు, పత్రికలు................

ఇది బుచ్చిబాబు కథ లోని "ఆ ఉ ఓ లు" కథ లోని కొంత భాగం.
ఎందుకు వ్రాశానంటే, కొంతమంది ఈ మధ్య, తమ చిన్నప్పటి ఙ్ఞాపకాలూ, ఆటలూ ప్రచురించి మురిసిపోతున్నారు. బాగానే ఉంది.
ఇంకొంతమంది, ఫలానా కవి/రచయిత అంటూ, వారి జయంతులకీ, వర్థంతులకీ పోస్టులు పెడుతూ, వాళ్లు ఫలానా ఫలానా కావ్యాలూ, నవలలూ, శతకాలూ వగైరాలు పుంఖానుపుంఖాలుగా వ్రాశారు అని ఉట్టంకిస్తూ ఆనంద పడుతుంటారు.

నేనన్నది--అలా లిస్టు వ్రాయడం కాదు--ఆ పుస్తకాలలో, కనీసం ఒకటి రెండు ఐనా సంపాదించండి. ఇతరులకి అందించండి అని.
అలా చేస్తే, బుచ్చిబాబు పాత పుస్తకాల దుకాణం లో చూసినట్టు వ్రాసిన పుస్తకాలన్నీ ఇప్పుడు లభ్యం అయి ఉండేవి కదా? (కాశీమజిలీ కథలు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. సంతోషం.)

మిత్రుడు పి టి ఎస్ కె రాజన్‌ తన బ్లాగులో ఉదహరించిన పుస్తకాలన్నీ దాదాపు లభ్యం అవుతున్నాయి. కానీ, నన్నయ దగ్గర నుంచీ, పోతన దగ్గర నుంచీ--నేటి గరికిపాటి వారు, కడిమిళ్ల వారి వరకూ--ఫలానా ఇన్ని పుస్తకాలు వ్రాశారు అని చెప్పుకోవడమే గానీ, వాటిలో ఎన్ని లభ్యం అవుతున్నాయి?
ఇప్పటికైనా ఎవరైనా పూనుకుంటే, భావితరాలకి కొన్నైనా అందించగలం!
ఆలోచించండి!

సాహిత్యం -- గ్రంథాలూ

బుచ్చి బాబు కథలు--
ఆ ఉ ఓ లు
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈతాకుల చాపమీద పరిచి వున్నాయి. మధ్యన ఒక గల్లాపెట్టెలాంటిది వుంది. గజం దూరం లో ఎలక్త్రిక్ దీప స్తంభం, మడిచేసిన ఒక గొడుగు, మిగతావి పాత పుస్తకాలు. అవన్నీ నిజంగా పాత పుస్తకాలే. పాతవే కాదు, ప్రాచీనమైనవి కూడా. అన్నీ తెనుగు గ్రంథాలే. కొన్నింటికి అట్టలే లేవు, పమిటకొంగులేని చీరలా; కొన్నింటికి మధ్యకుట్టిన కంతలు తప్ప దారం లేదు. కొన్ని తుదిమొదళ్లు లేని, పుస్తక కళేబరాలు. కొన్నింటి పుటలు, కదిపితే్ పొడుం గా విడిబోతున్నాయి. కొన్నింటిలో అచ్చు కనిపించడం లేదు. మరికొన్ని లెదర్ బైండింగ్ లో వున్నా-యమధర్మరాజు చర్మం లా వాటి లోపల పుటల్లో సాలీళ్లు, బొద్దింకలు, నెమలీకలు, ఈగలు, దోమలు వీటి కళేబరాలు, పురావస్తు పరిశోధకుడికి పిచ్చెత్తించేవిగా వున్నాయి. ఎండకి ఎండి, వానకి తడిసి, కొనవూపిరితో పడి వున్నాయి చాలా పుస్తకాలు. అక్కడవున్న కొన్నిపుస్తకాల పేర్లు--'ముకుంద విలాసము', కస్తూరి రంగకవి 'సాంబ నిఘంటువు', బహుజనపల్లి సీతారామాచార్యులుగారి 'ప్రసన్న పారిజాతము', 'అలఘు కౌముది' అందమైన పేరు. మంత్రిప్రగడ భుజంగరావుగారి 'ఉత్తరరామ చరిత్ర', ఆ పెద్ద పుస్తకం క్రింద కన్నుమీటుతున్నది దాసు శ్రీరామ పండితులవారి 'తెలుగునాడు' అన్న కావ్యం. పుటలు తిప్పి చూశాను. బ్రాహ్మణశాఖలు మాట్లాడే వ్యవహారికాన్ని అనుకరిస్తూ 'అవ్షే', 'సూస్సివషే', 'బలే చౌడషే', 'కాదషే' లాంటి ఉదాహరణలున్నట్లు ఇప్పటికీ ఙ్ఞాపకమే.

ఆంగ్లకవి విలియమ్‌ కూపర్ రచించిన జాన్‌ గిల్పిన్‌ అను హాస్య కావ్యానికి 'దుర్మార్గ చరిత్రము' అన్న తెలుగు అనుసరణ నన్నాకర్షించిన మరో పుస్తకం. దౌల్తాబాదు హనుమాయమ్మగారి 'మన్వంతరము', గంగతపల్లె శంకరరావు గారి 'భారత సారము' అను గద్యము, గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు అబ్రహమ్‌ లింకన్‌ గూర్చి వ్రాసిన 'విస్మృత రాజకవి' అను గ్రంథం. 'వైశాఖ' పత్రికలు--బైండు చేసిన సంపుటాలు, అవటపల్లి నారాయణరావుగారి 'విశాలాంధ్రము' సీరము సుభద్రమ్మగారి నవల 'జాగిలం' ఇంకా 'త్రిపురాంతక శతకం', 'కాశీమజిలీలు' మూడవ భాగం. నాకు ఙ్ఞాపకం ఉన్నంతవరకూ ఇలాంటివి అక్కడున్న పాతపుస్తకాలు. అవన్నీ యాభై అరవై ఏండ్లనాటి పుస్తకాలు. వాటినిగురించి నాకేమీ తెలియదు. వాటిల్లో దేన్నీ నా జీవితం లో చదవను. కాని అవి ఉన్నాయని తెలుసుకుని వాటి వెనకవున్న తెలుగు సాహితీ సంప్రదాయాన్ని తల్చుకుని ఆనాటి రచయితల్ని అభినందించకుండా ఉండలేను. ఎన్నో చెత్తపుస్తకాలు వస్తేనేగాని, ఒక మంచి పుస్తకం రాదంటారు. సమకాలిక గ్రంథాల విలువల పరిశీలనకి అవి గీటురాయి. కాని వాటిని చెత్తపుస్తకాలు అనడానికి కూడా నాకు అర్హత లేదేమో.ఆ పుస్తకాలలో వస్తువుమీద, అవి వ్రాసిన వారిమీదా మనస్సు పోవనారంభించింది. ప్రస్తుతాన్నుండి, వెనకటి రోజులకు పారిపోవాలనిపిచింది. నాకా ఊళ్లో కర్మాగారాలు, విద్యుత్ దీపాలు, మరలు, లారీలు, సిమెంట్ కట్టడాలు నచ్చలేదు. బాల్యం లో నే ఎరుగున్న చెరువులో తామరాకులు, కాలవలో గేదెలని కడుగుతూ గేదెపై స్వారీచేస్తూ పాడుకుంటున్న పశువులకాపరీ శ్రీరామనవమినాడు పందిట్లో హరికథలూ, మర్రిచెట్టుక్రింద పల్చటి చందమామ ఆకులమధ్య కనబడుతూ, ఇలాయిబుడ్ల వెలుగులో ప్రాణాలుతోడే వూపుతో సాగే గొల్లసుద్దులూ, చల్లటి పూరిపాకలు, తరవాణి కుండలూ, చెట్లనీడలో పొడుం పీలుస్తూ పెద్దల చదరంగపుటెత్తులూ నాకవే ఇష్టం. ఆ జీవితం ఆ పుస్తకాల్లో ఉంది . పాత పత్రికల సంపుటాల్లో గోదావరి మీద వంతెన వేయడం, మొదటి రైలు వెళ్లడం వార్త చూశాను. గతానికీ నాకు లంకె ఆనాటిపుస్తకాలు, పత్రికలు................

ఇది బుచ్చిబాబు కథ లోని "ఆ ఉ ఓ లు" కథ లోని కొంత భాగం.
ఎందుకు వ్రాశానంటే, కొంతమంది ఈ మధ్య, తమ చిన్నప్పటి ఙ్ఞాపకాలూ, ఆటలూ ప్రచురించి మురిసిపోతున్నారు. బాగానే ఉంది.
ఇంకొంతమంది, ఫలానా కవి/రచయిత అంటూ, వారి జయంతులకీ, వర్థంతులకీ పోస్టులు పెడుతూ, వాళ్లు ఫలానా ఫలానా కావ్యాలూ, నవలలూ, శతకాలూ వగైరాలు పుంఖానుపుంఖాలుగా వ్రాశారు అని ఉట్టంకిస్తూ ఆనంద పడుతుంటారు.

నేనన్నది--అలా లిస్టు వ్రాయడం కాదు--ఆ పుస్తకాలలో, కనీసం ఒకటి రెండు ఐనా సంపాదించండి. ఇతరులకి అందించండి అని.
అలా చేస్తే, బుచ్చిబాబు పాత పుస్తకాల దుకాణం లో చూసినట్టు వ్రాసిన పుస్తకాలన్నీ ఇప్పుడు లభ్యం అయి ఉండేవి కదా? (కాశీమజిలీ కథలు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. సంతోషం.)

మిత్రుడు పి టి ఎస్ కె రాజన్‌ తన బ్లాగులో ఉదహరించిన పుస్తకాలన్నీ దాదాపు లభ్యం అవుతున్నాయి. కానీ, నన్నయ దగ్గర నుంచీ, పోతన దగ్గర నుంచీ--నేటి గరికిపాటి వారు, కడిమిళ్ల వారి వరకూ--ఫలానా ఇన్ని పుస్తకాలు వ్రాశారు అని చెప్పుకోవడమే గానీ, వాటిలో ఎన్ని లభ్యం అవుతున్నాయి?

ఇప్పటికైనా ఎవరైనా పూనుకుంటే, భావితరాలకి కొన్నైనా అందించగలం!
ఆలోచించండి!

Friday, September 20, 2013

అప్పటికీ, ఇప్పటికీ

క్షణంలో సగం


--శ్రీరంగం శ్రీనివాసరావు

(ఇది--ఆంధ్ర జ్యోతి మాసపత్రిక, 1949 ఏప్రియల్--ఉగాది సంచికలో ప్రచురించబడింది. తరువాత ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో నేను చూడలేదు.)

ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు. 

"బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు కాబట్టి సగం సగం మాత్రమే నమ్ముతాను.

ఇద్దరం బయలుదేరిన తర్వాత వీడు (ఎవరి పేరైతే చెప్పదలచుకోలేదో వాడు) "ఇప్పుడు మనం లక్షాధికారులం కావడం ప్రారంభిస్తున్నాం. తక్షణమే! జోరుగా నడు" అన్నాడు. ఇద్దరం తక్షణం ప్రారంభించాం. కాని ఆ ప్రారంభం ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉండి పోయింది. అప్పుడు బయల్దేరిన మేము ఇంకా బయల్దేరుతూనే ఉన్నాం.

*   *   *

ఈ సాయంత్రం ఇక్కడ ఈ నగరంలో.....సముద్రంలాంటి ఆకాశంలాంటి ఎడారిలాంటి ఆకాశంలాంటి సముద్రంలాంటి ఎడారిలాంటి ఎడారి, సముద్రంలాంటి ఎడారి, ఆకాశంలాంటి ఎడారి, ఎకసక్కెంలాంటి ఎడారి........

ఇక్కడ ఈ నగరంలో ట్రాం లో నేను......ఎదురుగుండా సెలూన్లో అద్దంలో నేను : అదైనా క్షణంలో సగంసేపు!

అదీ అసలు సంగతి. ట్రాంలో వెళుతున్న నేను సెలూన్లో అద్దంలో క్షణంలో సగంసేపు నన్ను నేను ప్రతిబింబించి నాకు నేను కనిపించాను. క్షణంలో సగంసేపు ఒకేసారి సెలూన్లోనూ ట్రాంలోనూ నివసించాను.

ఇక్కడ ఈ సాయంత్రం........ఎడారిలో ఆకాశంలో క్షణంలో సగంలో ట్రాంలో సెలూన్లో జనం మధ్య జనసముద్రమ్మధ్య జనసముద్రం మధ్య నేను.

ఇక్కడ ఈ నగరంలో  ఈ క్షణంలో సగం సేపు ఏమిటి జరుగుతోంది?

*   *   *

"మనం లక్షాధికారులం కావడం ఎప్పుడు ప్రారంభిస్తాం" అని ప్రశ్నించాడు నయనకన్ను. వాళ్లిద్దరూ నాయరు దుకాణంలో నిన్నటి పకోడీలు నములుతున్నారు."ఇదిగో ఈ క్షణం" అన్నాడు దొరసామి. "టీ తీసుకున్న తక్షణం."

"డబ్బులు చాలుతాయా" అన్నాడు నయనకన్ను.

నాయరు రెండు గ్లాసులతో టీ తెచ్చి--వాళ్లముందుంచి పోయాడు.

"గుర్రాలు మోసం చేశాయని చెబుదాం. అరువుంటాడు నాయరు" అన్నాడు దొరసామి.

*   *   *

అక్రమ లాభాలమీద అదనపు పన్ను తగ్గింపు. ఆర్థిక పరిస్థితిమీద కేంద్ర ప్రభుత్వపు దండయాత్ర కృషి. ఇతోధిక కృషి. ద్రవ్యోల్బణము. దాని నరికట్టుటకు ఆరు మార్గాలు. రామపాదాల పీత నడక. అన్నివేళలూ తేనీటి వేళలే.

*   *   *

కాకెమ్మ చక్కని చుక్క. నిజంగా ఆ పేరుకి తగ్గదికాదు. పదేళ్ల కిందట మరీ బాగుండేది. అప్పుడు సినీమాలో నటించడానికిక్కడకు వచ్చింది. ఒక కెమేరా మనిషి ఆమె శరీరాన్ని అనేక కోణాలనుంచి చూసి చవిచూసి 'నువ్వు మంచం మీదకే కాని తెరమీదకి పనికిరా'వన్నాడు. దరిమిలాను చాలామంది ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు కాకెమ్మ ఇంకో మంచం మీదకి వెళ్లబోతూంది.

*   *   *

దశవర్ష ప్రణాళిక బుట్టదాఖలా. బంగారం ధర పడిపోవడంవల్ల బ్యాంకులకి మూడురోజులు సెలవు. ఈ రాత్రి చంద్రుడు నూటికి 75 వంతుల నష్టంతో వ్యవహరిస్తాడు. అనుకోని గుర్రాల ఆకస్మిక విజయం.

*   *   *

జమీందారు సొంతకారు నడుపుకుంటూ జోరుగా పోతున్నాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాతనో అంతక్రితం ఆరేడు నెలల పూర్వమో జమీందారు జాతీయ మతం తీసుకొని దీక్షావస్త్రాలు ధరించాడు.

పేవ్ మెంటుమీద నడుస్తున్న కుర్రాడు జమీందారును చూశాడు. కుర్రాడి జేబులో వేడివేడి వేరుసెనగపప్పుంది. పిడికిటి నిండా వేరుసెనగపప్పు తీసుకొని పట్టుకున్నాడు. కద్దరు దుస్తులతో కనుపండువుగా కనబడుతూన్న జమీందారుని వెరుసెనగ పప్పుతో అభిషేకించాలన్న ఆశ ఆ కుర్రాడి మనస్సులో మెరుపులాగ మెరిసింది. కాని ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. కారు జోరుగా దాటిపోయింది.

*   *   *

జగద్విఖ్యాతి వహించిన షేక్స్పియరు మహాకవి నాటకం హేమ్ లెట్. మనస్సు స్థిరపరచుకోలేకపోయిన మానవుని విషాదాంత గాధ.

*   *   *

"ఉప్మా పట్రా" అన్నాడు. పట్టుకొచ్చాడు అయ్యర్వాళ్. తింటున్నాడు తెమ్మన్నవాడు. అందులో రెండు రాళ్లున్నాయి. కాఫీ తీసుకోకుండానే బిల్లు తీసుకొని డబ్బు చెల్లిస్తూ "ఉప్మాతోబాటు రెండు రాళ్లు ఎక్కువగా ఇచ్చాడు. అంచేత వాటికి నా యథాశక్తి ధర రెండర్థణాలు ఒక అణా చెల్లిస్తున్నా" నని అణా ఎక్కువ ఇవ్వబోయాడు. నేతాజీ విలాస్ కాఫీ క్లబ్బు (ఇక్కడ పదార్థాలు కల్తీలేని నేతితో చెయ్యబడవు) ప్రొప్రయిటరు అణా వైపు అతి భయంకరంగా చూశాడు. "ఎవరైనా బిచ్చగాడికి ధర్మం చేసుకో" అన్నాడు. రాళ్ల ధర చెల్లించదలచుకున్న మనిషి అణాకాసుని జేబులో వేసుకొని రెండు అయిదు రూపాయల నోట్లు బల్లమీదపెట్టి వెళ్లిపోయాడు.

"వెర్రి వెధవ" అనుకున్నాడు ప్రొప్రయిటరు, రూపాయి నోట్లను దాచేస్తూ.ఆ సమయంలోనే ఒక అణాకాసు అడుక్కునే అమ్మి డబ్బాలో పడ్డ చప్పుడయింది.

*   *   *

"కమ్యూనిస్టులను పాతేస్తున్నాం" అన్నారు దొరతనంవారు. పాతేస్తున్నారు. వానలు కురిస్తే దేశం అంతటా కావలసినంత పంట.

*************

(64 న్నర సంవత్సరాల తరువాత ఇప్పుడుకూడా నిన్ననో మొన్ననో వ్రాసినంత తాజాగా లేదూ ఈ కథ? ఆలోచించండి!)

Tuesday, October 16, 2012

తెలుగు నాటక సాహిత్యం



ఒక గొప్ప రచన

ముత్యాలముగ్గు సినిమాలో 'మాడా' - రావు గోపాలరావుతో బేరమాడుతూ, "మర్డరుకీ సెపరేషనుకీ యెంతవుద్ది, సెపరేషనుకీ మేరేజికీ యెంతవుద్ది, మర్డరుకీ, సెపరేషనుకీ, మేరేజికీ యెంతవుద్ది..........వోలుమొత్తానికి యెంతవుద్ది? కన్సెసనేమైనా వుందా?" అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పిన 'పొడవాటి ' డైలాగు గుర్తుందా?

అంతకు యాభయ్యేళ్ల క్రితమే ఓ నాటకంలో ఈ క్రింది సంభాషణని గమనించండి.

"అలాగైతే, సంబంధాల విషయంలో మీయభిప్రాయము ఏమిటో సంగ్రహముగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక చదువూ, సంప్రదాయమా? సంప్రదాయమూ సంపత్తా? సంపత్తూ చక్కదనమూనా? చక్కదనమూ చదువూ; చదువూ సంపత్తూ--ఈ విధముగా వుండవలెనా?"

ముళ్లపూడివారికి ఈ సంభాషణే స్పూర్తి యేమో!

ఈ సంభాషణ కాళ్లకూరి నారాయణరావుగారి "వరవిక్రయము" అనే నాటకం లోనిది.

1921 వ సంవత్సరంలో మొట్టమొదట ప్రచురింపబడి, తరువాత అనేక ముద్రణలు పొందుతూ, జాతీయోద్యమంలో భాగంగా కొన్నివేల ప్రదర్శనలకి నోచుకొన్న ఈ నాటకం మరుగునపడినా, అందులో విమర్శింపబడ్డ "వరకట్న దురాచారం" మాత్రం ఇంకా సమసిపోలేదు.

గురజాడవారు విమర్శించిన "కన్యా శుల్కం" అనే ఆచారం సహజ మరణం చెందడానికి కారణం, అప్పట్లో "విధవా వివాహాలు" చెయ్యవలసిరావడం జోరందుకోబట్టే, దానికి బ్రాహ్మణ్యం మింగలేక, కక్కలేక వూరుకోవడమే అనే వాదన నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ వరకట్నానికి సహజమరణం ప్రాప్తించేలా అన్ని కులాల్లోనూ యే ప్రక్రియా వూపందుకోకపోవడమే అది ఇప్పటికీ వర్ధిల్లడానికీ, వృధ్ధిపొందడానికీ కారణమేమో!

యేదైనా, ఈ నాటకాన్ని విరివిగా ప్రదర్శిస్తే కొంతలో కొంతైనా వుపయోగం వుంటుందేమో. ఇక కన్యాశుల్క నాటకాన్ని వదిలేసి, ఈ వరవిక్రయాన్ని మీడియావాళ్లూ, సాహితీపరులూ, సంస్కరణాభిలాషులూ తలకెత్తుకొంటే, యేమైనా వుపయోగముండచ్చేమో!

యేమంటారు?

(ఆ నాటకం లోని కొన్ని చక్కటి సంభాషణలు విడతలవారీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను--మీరు చదవడానికి ఆసక్తి చూపితే.)

Sunday, May 20, 2012

బాపు సృష్టి.....


.....శ్రీరామరాజ్యం

మన టీవీ వాళ్ల పుణ్యమా అని, ఇవాళ (20-05-2012) వుదయం ఓ ఛానెల్లో "లవకుశ"; సాయంత్రం ఇంకో ఛానెల్లో "శ్రీరామరాజ్యం" రెండు సినిమాలూ చూడగలిగాను. (ఇంతవరకూ శ్రీరామరాజ్యం చూసే అవకాశం రాలేదు.)

లవకుశ సినిమాలో ప్రతీ ఫ్రేమూ ఇప్పటికీ నాకు గుర్తున్నా, మళ్లీ ఓ సారి పునశ్చరణ చేసుకొనే అవకాశం వచ్చింది.

ఇంక శ్రీరామరాజ్యం గురించి ఆ సినిమా విడుదల అయినప్పటినుంచీ అనేకమంది చేసిన వ్యాఖ్యలూ, సమీక్షలూ, పొగడ్తలూ, తెగడ్తలూ, వెకిలి విమర్శలూ.......అనేకం చదివాను, విన్నాను.

కానీ, చాలామంది పెద్దవాళ్లూ, పండితులూ కూడా దృష్టిసారించని, ప్రస్తావించని విషయం ఒకటి వుంది అందులో.

అది నిజంగా ఓ "దృశ్యకావ్యమే!"--ఇది అందరూ చేసినలాంటి పొగడ్త కాదు.

సాధారణంగా "రీమేకులు" ఒకసారి డబ్బుచేసుకొన్న కథని, ఇంకో భాషలో మళ్లీ డబ్బుచేసుకోడానికి తీస్తారు. మరి ప్రపంచ ప్రఖ్యాత బాపూ, రమణలకి ఆ అవసరం వుందా? ముమ్మాటికీ లేదు. అందుకే లవకుశని రీమేక్ చెయ్యలేదు వాళ్లు!

లవకుశని పూర్తిగా భక్తి భావంతో, ఇతిహాసం యెలా వుందో అలా చిత్రీకరించి, జనాల్లో భక్తి భావాన్ని రేకెత్తించినందుకు ఆ సినిమా విజయవంతమయ్యింది.

నిజంగా, ఇతిహాసం ప్రకారం, "రామరాజ్యం"లో, "సీతానింద" జరిగింది. దానిద్వారా, "శ్రీరామ నిందా" జరిగింది. అసలు దాన్ని "ఖండించడానికే" కంకణం కట్టుకొని,  వాల్మీకి వుత్తర రామచరిత వ్రాశాడన్నట్టూ, దానిద్వారా, కుశలవులచేత ఆ రామరాజ్యంలోనే ప్రచారం చేయించి, ఆ నిందలని దూరం చెయ్యడానికి ప్రయత్నించాడన్నట్టూ.......చాలా విపులంగా చెప్పారు!

అదీ ఆ సినిమా "హైలైట్"!

"అక్కడెక్కడో" లంకలో జరిగిన అగ్నిపరీక్ష గురించి, అయోధ్య ప్రజలకి యెలా తెలుస్తుంది? అందుకే నిందవేస్తున్నారు--అని చెప్పించి, దాన్ని చక్కగా డెవలప్ చెయ్యడం చాలా బాగుంది!

(అసలు అగ్నిప్రవేశ ఘట్టమే "ప్రక్షిప్తం"; వుత్తరరామ చరిత్రకోసమే అది సృష్టించారు అనేవాళ్లు కూడా వున్నారనుకుంటా).

(ఈ బ్లాగరు విధానం 'కాలింగ్ ఏ స్పేడ్ ఏ స్పేడ్' ప్రకారం అనేక లోటుపాట్లున్నాయి. కానీ, అవన్నీ--వారి దృష్టికి వచ్చినా, వ్యవధానంలేక, చూసీ చూడనట్టు వదిలేసినవే అని ఖచ్చితంగా చెప్పగలడు!)

శ్రీరాముడి మేకప్ గురించి కొంచెం శ్రధ్ధవహించవలసింది లాంటి విమర్శలన్నీ అలాంటివే. సీతాదేవిలో "ఐటం గర్ల్" యెవరూ కనపడలేదు. (భూమ్మీద బోర్లా పడుకొని, తన పళ్లన్నీ బయటపెడుతూ దుఃఖిస్తున్నప్పుడు మాత్రం అందవికారంగా వుంది.) ఇతరపాత్రలూ, పిల్లల నటనా, గ్రాఫిక్సూ, సమకాలీనంగా, బాగున్నాయి.

ఈ సినిమాని ఆంధ్రదేశం మొత్తం మీద, ప్రతీరోజూ, యేదో ఒక థియేటర్లో కొన్ని సంవత్సరాలపాటు ప్రదర్శిస్తూ, జనాలకి దాన్ని చూసే భాగ్యం యెవరైనా కల్పిస్తే సంతోషించేవాళ్లలో మొదటివాణ్ని నేను.

(టీవీలో యే ఛానెల్ అయినా అలా ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది)

ఆ బాపూ రమణలకీ, జొన్నవిత్తులవారికీ నా పాదాభివందనాలు. (యేదైనా లోపం యెక్కువగా వుందంటే--అది ఇళయరాజా సంగీతమే!)

శుభంభవతు!

Sunday, March 11, 2012

వేదికలపై......



......వాక్ప్రవాహాలు

మీరెన్నయినా చెప్పండి......అతి సర్వత్ర వర్జయేత్!

ఈమధ్య అనేక సభలూ, సమావేశాల్లో, సన్మానాల్లో, వివిధ కార్యక్రమాల్లో మనం చూస్తూనే వున్నాము. స్వడబ్బాలు అంతగా లేకపోయినా, పరడబ్బాలూ, పరస్పర డబ్బాలూ యెక్కువై పోయాయి.

ప్రతీ వ్యక్తీ తన జీవితకాలంలో తగిన సాఫల్యం చెందాలనే తన ప్రయాణం ప్రారంభిస్తాడు. 

ఓ కళాకారుడైనా, కవీ, రచయితా, సినీ కవీ--ఇలా యెవరైనా అందుకు కఠోర దీక్షతో శ్రమిస్తారు. కానీ కొంతమందికే "సాఫల్యం"......యేదో ఒక రూపంలో లభిస్తుంది.

వుదాహరణకి, పింగళీ, ఆత్రేయా, వేటూరీ, సిరివెన్నెలా.....ఇలా అందరూ కొన్ని వేల పాటలు వ్రాశారు. ఫలానా పాటకి ఫలానాది స్పూర్తి...అని కూడా ప్రకటిస్తూ వుంటారు. 

వాళ్లు వ్రాసిన పాటల్లో నిజంగా "మంచి పాటలు" ఒక శాతం కూడా వుండవు. సమీక్షకులూ, విమర్శకులూ, సాహితీ బంధువులూ వగైరాలూ, వారి వెనుక జనసామాన్యం "మంచిపాటలు"గా గుర్తించినవి ఓ 2 నుంచి 3 శాతం వుండొచ్చు. 

రికార్డు కంపెనీలూ, క్యాసెట్ కంపెనీలూ, ఇప్పుడు సీడీ/డివీడీ కంపెనీలూ "హిట్"లుగా చెప్పేవి ఓ 5 శాతం వుండొచ్చు. 

కానీ, మిగిలిన వాటి సంగతేమిటీ? ఆ మాత్రానికి....అంత అవసరమా?  

ఆవేశంలో వచ్చినట్టే, వుద్వేగంలో మాటలొచ్చేస్తాయి-- 

సంతోషం ప్రకటించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, పొగడ్డానికి--ఇలా ప్రవాహంగా వచ్చేస్తూ వుంటాయి!

మనసులో యేర్పడుతున్న ఆలోచనల గొలుసుకట్టుని వెంటవెంటనే మాటల్లోకి మార్చుకొని, చక్కగా వారి భావాలని శ్రోతలకి, మనసుల్లోకి చొచ్చుకొనిపోయేలా చెప్పడం అనేది--పుంభావ సరస్వతులకి మాత్రమే సాధ్యం!

కాళా తపస్వులకీ, ఎస్పీ బాలు లాంటివాళ్లకీ, సిరివెన్నెల లాంటి వాళ్లకీ, సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల--ఇలా చాలా మందికి అది వుగ్గుతో అబ్బిన విద్య.

కానీ.......

అక్కడే సంయమనం అవసరం. 

చూసేవాళ్లకీ, వినేవాళ్లకీ "అంతుందా?" అనిపిస్తే, మీ నటన (అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్) యేమి సాధించినట్టు?

ఎస్పీ ఈ మధ్య కొంతవరకు సంయమనం పాటిస్తున్నాడు....ఇంతకన్నా నేను ఇంక యెక్కువ మాట్లాడను....అనేస్తున్నాడు. 

రెండు సంవత్సరాలుగా, శివరాత్రిరోజున, "పాడుతా తీయగా"కి తనికెళ్ల భరణి ని ఆహ్వానించి, ఆయన "తుస్....బుస్....ఖస్....శంకరా" అంటూ చదువుతున్న కవితలని బాగా మోసేస్తున్నాడు. సందేహం లేదు--భరణి అలౌకిక ప్రజ్ఞ కల కవీ, రచయితా. 

కానీ......

"హూష్.....
స్పేస్........
సుభాష్...
చంద్రబోస్ లా.....

అంతా ఖామోష్!"

ఇది వ్రాసిందెవరో గుర్తొచ్చిందా?

మరెందుకీ శషభిషలు?

"ఆయన నాకు తండ్రితో సమానం...వాడిక్కూడా తండ్రితో సమానం అంటున్నాడుకాబట్టి, వాడు నాకు సోదరుడితో సమానం....." ఇలా భాషణం సాగాల్సిన అవసరం వుందా?

పెద్దలు నామాటలని "విమర్శగా" కాకుండా, ఓ సలహాగా స్వీకరిస్తే సంతోషిస్తాను. 

ముఖ్యంగా......ఇలాంటివాటివల్ల కొన్నివర్గాల ప్రేక్షకులనీ, శ్రోతలనీ, సామాన్య జనాన్నీ దూరం చేసుకొంటున్నారని గమనిస్తే......ఇంకా సంతోషం!

గ్రహించండి.

Saturday, February 11, 2012

తెలుగు సాహిత్యం



సాహిత్యం అంటే....

(ఇదివరకటి నా టపా "చక్కని సాహిత్యం అంటే....ఇలా వుండాలి ట" కి కొందరైనా సాహితీపరులు స్పందిస్తారనుకున్నాను. అంతకు ముందు టపాలకి కూడా స్పందన లేదు....యెందుకో మరి)

కవీ, రచయితా, చిత్రకారుడు, ఇంకా చాలా అయిన "బహుముఖ ప్రజ్ఞావంతుడు" అడివి బాపిరాజు 1946 లో వ్రాసిన "కోనంగి" నవలలోనివి ఆ టపాలో వ్రాసిన పేరాలు.....అక్కడక్కడా సేకరించినవి.

ప్రతి పిచ్చిరాతా "సాహిత్యం"గా చెలామణి అయిపోతున్న ఈ రోజుల్లో, అలాంటి సాహిత్యం అరుదుగా కనిపిస్తుంది అనే ఉద్దేశ్యంతో మాత్రమే వ్రాశాను.

ఒక సమయంలో, సినీ పరిశ్రమలో అ, ఆ లు అంటే, "అక్కినేని, ఆదుర్తి" అనేవారు. అవేరోజుల్లో, అక్కినేని "అ ఆ లు" (అక్కినేని ఆలోచనలు) అనే పేరుతో కవితలు వ్రాస్తే, "వీడికి అదొక్కటే తక్కువ" అన్నవాళ్లున్నారు. 

ఇప్పుడొస్తున్న కవితలూ, తవికలూ, హైకూలు, నానీలు, నానోలు, తాతీలు, తాతూలు లాంటి "కవిత్వం" తో పోలిస్తే, అవి గొప్పకవితలు అనిపిస్తాయి.

అవి ఇప్పుడు యెక్కడైనా దొరుకుతున్నయో లేదో!

Friday, December 23, 2011

చక్కని సాహిత్యం అంటే……

......ఇలా వుండాలి(ట)!


అనంతలక్ష్మి దేహంలో మనస్సులో నిర్మలత్వం ఉంది. రఘునాధరాయని హృదయ మహారాజ్యం ఆక్రమించి, చక్రవర్తియై రాజ్యమేలిన దివ్యసుందరి, భూమికి దిగివచ్చిన పరమాప్సరస సుందరి మధురవాణి అందమంతా ఈ బాలికలో ప్రత్యక్షమైంది. కొంచెం కోల, కొంచెం గుండ్రని మోము, అయిదడుగుల ఎత్తు, పొట్టి పొడుగుకాని ముక్కు, సమమైన కోలతనంలో దవడలో, బుగ్గలు ఫాలము ఏకరేఖా ప్రవాహ సామ్యం కుదిరి వుంటాయి. అలాంటి మోము గుంటలుపడే బుగ్గలు, కొంచెం పైకి తిరిగిన పై పెదవి, కొంచెం అంటే కొంచమే ఎత్తయిన క్రింది పెదవీ, సుడులుపడే సమ చుబుకమూ ఉండి, ఆ మోము కాసు బంగారం రంగు కలిగి, ఆ రంగుకు తగినట్లు లేత గులాబీ రాగం అప్పుడప్పుడా బుగ్గలకి ప్రసరిస్తూ ఉంటే, అలాంటి సౌందర్య నిధులన్నీ చేకూరినచోట, ఆ నిధులకు కిరీటంలాంటి కళ్ల అందం వెలసిందనుకొంటే, ఆ దివ్య సౌందర్యవదనం అనంతలక్ష్మిది. కాంచనమాలను, సుబ్బలక్ష్మిని, నళినీజయవంత్ ను ముగ్గురినీ కరిగించి పోతపోస్తే అనంతలక్ష్మి అవుతుంది.

ఆవును. అనేకమందికి చక్కని హృదయాలనన్నీ గబగబ పువ్వుపుణికినట్లు పుణికే శక్తిగల సౌందర్యపూర్ణమైన మోము ఉంటుంది. అంతే. ఆ మోముకు తగిన తలగానీ, తలకట్టుగానీ ఉండవు. ఆతి పెద్ద లంకగుమ్మడి లాంటి తలో, పొన్నకాయలా మెదడులేని తలో ఉంటాయి. ఆనంతలక్ష్మికి తలకట్టు, తోడిరాగాలాపన ఆమె కేశ సౌభాగ్యము. కేశరంజనివారి ప్రకటన చిత్రాల తలకట్టులకు పాఠాలు నేర్పుతుంది. 




……………

ప్రేమ అనే మహోత్తమ స్థితి మనుష్యుని జీవితంలో ఊరికేరాదు. భర్తతో స్నేహమూ, స్త్రీ పురుష సంబంధ ప్రీతీ సమ్మిశ్రితమై ఒకరకమైన ప్రేమగా పరిణమిస్తాయి. ఒకనాడాస్థితి సంపూర్ణ ప్రేమ కావచ్చును.

కాని అసలు ప్రేమే స్త్రీకిగాని, పురుషునికిగాని సంభవిస్తే, అది అమృత మహానది. సరస్సు కట్టలు తెగినట్లవుతుంది.



* * *

“ఆకలి అవుతున్నది గాని (జావ) సహించడంలేదు లక్ష్మీ!”
“మీ వంట్లో ఒక వీశెడు క్వినయిను ప్రవేశించింది. అందుకనేగాదండీ మిమ్మల్ని పళ్లరసం తెగతాగమంటారు డాక్టరు!”

“సరేలే! రెండుమూడురోజులలో పైత్యనాడి తిరగకపోతుందా ఏమిటి? తిరక్కపోతే పైత్తకారినే అయిపోతాను!”


“అయితే గురువుగారూ, మీరు ఎప్పుడూ అల్లా నవ్వువచ్చే మాటలు మాట్లాడుతూనే ఉంటారా?”

“నాకు ఏడుపు మాటలు చేతకావు. కృష్ణశాస్త్రిగారి శిష్యరికంచేసి ఇంత ఏడుపు కవిత్వం రచించడమన్నా నేర్చుకోవాలి!”
“నవ్వుకవిత్వం, ఏడుపు కవిత్వాలేగాని, ఇంకోరకం కవిత్వం తెలుగులో లేనేలేవా అండి?”
“లక్ష ఉన్నాయి. రాయప్రోలువారి ప్రియురాలే చెల్లెలు కవిత్వం, వేదులవారి పూవుల కవిత్వం, నండూరివారి పల్లెటూరి కవిత్వం, తుమ్మలవారి రైతు కవిత్వం, విశ్వనాథవారి ఎత్తుకొండల కవిత్వం, కాటూరి పింగళుల తేనేపెరడు కవిత్వం, కవికొండలవారి అటుకులు, జీడిపప్పు కవిత్వం, దీక్షితులవారి బువ్వాలాట కవిత్వం……”
“అదేమిటండీ! ఒకటడిగితే ఇరవై చెబుతారు ఇంతనీరసంగా ఉన్నారు కూడా?”
“ఈలా మాట్లాడుతూ ఉంటే, కాస్త జావకూడా సయిస్తుంది. ఇంకో వెండిగిన్నెడు జావా, దానితోపా సాతుకుడిరసం ఒక పెద్ద గ్లాసుడూ పట్టుకురా అనంతయ్యగారూ!”



……….


ఆమె పరుగెత్తుతూ ఉంటే ఆమె దేహ సౌష్టవచంద్రిక వెన్నెల కురుస్తుంది అనుకొన్నాడు…..ఎక్కడా అపశ్రుతిలేని శరీరాంగ నిర్మాణం ఈమెలో చేతులూ, వక్షనిధులు, నడుము, కటి, కాళ్లు, పాదాలు బ్రహ్మదేవుడు దివ్యలలిత కళాపారవశ్యకతతో సృషించి ఉంటాడనుకున్నాడు. ఆందమైన బాలికలు ఉండడమే లోకానికి ఆపత్తు. ఆందం సూదంటురాయి. మగవాళ్లు అనే ఇనుప శకలాలను ఆకర్షిస్తే ఏలాగు తనబోటి దద్దమ్మల బ్రతుకు!
(అంతలో కాస్త చరిత్ర)

"డాక్టరు రంగనాయకులు రష్యా ప్రియుడు, కమ్యూనిస్టువాది. కాంగ్రెసులో పనిచేసి దేశంలో ఉన్న శక్తులను కాంగ్రెసు కట్టుకురాలేకపోతున్నదని, అహింసా వాదమువల్ల ఎదుటివాడి హృదయం మార్చడం అనే ఆశయం ఉద్భవం అవుతుందనీ, ఈలోగా తిండిలేక మాడిపోతూ ఉంటారు ప్రజలు అనీ నిర్ధారణచేసుకున్నాడు. ఆచార్య నరేంద్రదేవు, జోషీ, జయప్రకాష్ మొదలగువారి వాదనలు నచ్చాయి. ఆ రోజుల్లో కాంగ్రేసు ఎడమచేతి వాదన వారుండేవారు. వారు కాంగ్రెసు సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనీ.

జోషి మీరట్ కేసులో ఉన్నాడు జైలుకి వెళ్లాడు. ఆ సందర్భంలోనే ఆ తర్వాతనే జోషి, డాంగే మొదలగువారు కమ్యూనిస్టులుగా ఉండి రహస్యంగా సామ్యవాదాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. వారిలో చాలామంది కాంగ్రెసు సభ్యులే.

ఫ్రభుత్వం కమ్యూనిస్టు సంఘాలను నిషేధించింది. ఆ కారణం చేత కమ్యూనిస్టులు కాంగ్రెసులోనే ఉండి పనిచేస్తూ వుండిరి.
జయప్రకాష్ నారాయణ్, మెహరల్లీ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైనవారంతా కాంగ్రెస్ లో సోషలిస్టులుగా (సాంఘికవాదులుగా) ఉండేవారు.
డాక్టరు వీరి వ్రాతలు చదివేవాడు. బోల్షివిజం ను గురించి చదివేవాడు. 1928లోనే పరీక్ష పూర్తిచేసి, 1930లో మదరాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. ……1930లో కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభించింది. 1931 తిరిగి వచ్చింది. మళ్లీ 1932 కాంగ్రెసువారినందరినీ కారాగారాలలో బంధించారు. కాని చాలా మందిని ప్రభుత్వంవారు లాఠీ ప్రయోగం చేసి మాత్రం వదులుతూ ఉండేవారు.........."
(అవునా?)


Saturday, December 3, 2011

మన సినీ సాహిత్యం



ఓ.......కోలవెరి!

ఈ మధ్య "త్రీ" సినిమా కోసం కుర్రాళ్లు ట్యూన్ చేసి పాడిన కోలవెరి పాట ప్రపంచ వ్యాప్త హిట్ అయి, అందరినోళ్లలోనూ నానుతోంది!

అందులో యేమిటీ గొప్పతనం? గొప్ప సాహిత్యం వుందా? గొప్ప సంగీతం వుందా? గొప్ప వాయిద్యసహకారం వుందా? మరేమిటి?

శంకరాభరణం శంకర శాస్త్రి "బ్రోచేవారెవరురా" గురించి అన్నట్టు--"ఆ కీర్తన అణువణువులోనూ 'ఆర్ ద్రత' నిండివుంది దాసూ!"--అదీ సంగతి.

కొన్ని నెలలుగా గుళ్లలో వినిపిస్తున్న పాటలని--ఈ మధ్య కుర్రపిల్లలు విడుదలచేశారని పేపర్లలో మెచ్చుకొంటున్న "......పూజలు" సిరీస్ సీడీల్లాంటివేమో అనుకున్నాను. 

పెద్దల బ్లాగులు చదవగా తెలిసింది అవి "శ్రీరామ రాజ్యం" సినిమాలోవని!

లవకుశ పాటలన్నీ ఇప్పటికీ హిట్ గా  యెందుకున్నాయి, ఈ పాటల ఆయుర్దాయం యెంత అని యెవరైనా ఆలోచిస్తే......నిజం తెలీదూ?

పైగా, పాటల రచయితల "స్వకుచమర్దనం" ఒకటీ! ఆపాటకి స్ఫూర్తి...అలా...అంటూ!

ఇప్పటి చిన్నారులకి పద్యాలు వినిపిస్తే మీచేతులు కొరికి పారిపోతున్నారా? వాటి అర్థం మీకే తెలీదుకాబట్టిగానీ, ఇది వరకు మా చిన్నారులకి మేము వినిపించలేదా? వాళ్లు మా చేతులు కొరికి పారిపోయారా? 

"శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా....." అంటే వాళ్లకి అర్థం కాదు అని మీరు నిర్ధారిస్తే, అది యెవరి తప్పు? 

అదీ తెలీకపోతే, "నాదు జపము తపమూ, నా కావ్యమే వృధా"!

Friday, September 30, 2011

తెలుగుభాషా......




.......వికసనం

మన తెలుగు భాషలోని "పందికొక్కు" అనే మాటని ఇంగ్లీషువాళ్లు స్వీకరించి, వాళ్ల భాషలో "బేండికూట్" అని చేర్చుకొన్నారట! అలాగే కదా భాష వికసించేది! 

ఇంకా యెన్ని విధాలుగా వికసించగలదో అనే ఆలోచన వచ్చేసరికి కొన్ని పాత విషయాలు జ్ఞాపకానికొచ్చాయి. 

మేం రెండో ఫారం (యేడో క్లాసు) చదివేటప్పుడు--1962లో--మా క్లాసు టీచరు--డేనియల్ మేష్టారు వుండేవారు. 

"నేను రోజూ సైకిలుమీద 'సఖం చెరువు ' (వారి స్వగ్రామం) నుంచి వస్తాను. తొమ్మిదింటికి స్కూలు అంటే, నేను యెప్పుడు బయలుదేరుతానో, ప్రొద్దున్నే యెన్నింటికి లేస్తానో వూహించండి. అలాంటిది, ఈ వూళ్లోనే వున్నవాడివి లేటుగా వస్తావా?" అని దులపరించేసేవారు లేటుగా వచ్చిన విద్యార్థులని బోర్డు ప్రక్కన గోడకానుకొని నిలబెట్టి! 

విషయానికొస్తే, ఆయన వూరి పేరు "సంఘం చెరువు". మునుపెప్పుడో డచ్చివాళ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రోజుల్లో, స్థానిక "సాలె"వారు తయారు చేస్తున్న అద్భుతమైన "అద్దకం" వస్త్రాలని చూసి, ముగ్ధులై, ఆ వస్త్రాలని అనేకసార్లు వుతకవలసిన అవసరాన్ని గమనించి, వారికి గ్రామ గ్రామానా చెరువులని "వ్రాసి ఇచ్చారు". 

వివిధ వూళ్లలో వాటిని "వూరి చెరువు"; "వూర చెరువు"; "సంఘం చెరువు".....ఇలా పిలిచేవారు. మా నరసాపురానికి దగ్గర్లో వున్న చెరువుని సంఘం చెరువు అనేవారు(ట). రానురానూ, ప్రజల పలుకుబడిలో అది "సగం చెరువు" ఐపోయింది. మరి "సగం" అంటే "అర్థ" అని అర్థం కదా? సగం అనేది పామర భాష....దానికి సరైన రూపం "సఖం" అని ఆయన అభిప్రాయం! యేది రైటంటారు?! 

(ఇప్పుడలాంటి చెరువులు లేవు. కొన్ని కబ్జా అయిపోయి కాలనీలు వెలిశాయి, కొన్ని పూడ్చబడి మునిసిపాలిటీలూ ప్రభుత్వం ఆక్రమించుకొన్నాయి. గత 50 యేళ్లుగా ఆ చెరువులని మాకు స్వాధీనం చెయ్యండి అంటూ పోరాడుతున్నారు ఆ కళాకారులు వివిధ కోర్టుల్లో!)

ఇంకో మేష్టారు వుండేవారు ప్రసాదంగారు అని. 

మామూలుగా జనం "సీతాఫలం" ని సీతాబళా పండు అనీ, "రామాఫలం"ని రాంబళా పండు అనీ, "లక్ష్మణఫలం"ని లక్షంబళం అనీ--దీన్ని చాలామంది చూసి వుండరు--అంటారు. 

అలాగే, క్రీస్తు పుట్టే సమయానికి ఆకాశంలో ఓ నక్షత్రం పొడిచి, దాని ఆథారంగా తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు పుట్టిన చోటికి చేరి, "సాంబ్రాణి"; "బోళము" వగైరాలు అర్పించారు(ట). 

ఇంక మా మేష్టారు, సైన్స్ పాఠం చెపుతూ, "మనగుండె 'రామబోళము ' ఆకారములో వుండును" అని చెప్పేవారు. (రాంబళా అనడం తప్పు, రామ ప్రక్కన వుండవలసింది 'బోళము ' అనడమే కరెక్టు అని ఆయన వుద్దేశ్యం!

ఇలా ఇప్పటికీ, చాలామంది మన భాష 'వికసనానికి ' తమవంతు సేవ చేస్తూవస్తున్నారు!

మీకు తెలిసినవాళ్లగురించి కూడా చెప్పండి.  

Monday, September 19, 2011

తెలుగు సినీ సాహిత్యం



.....హిట్/ఫట్ పాటలు

ఓ ముఫై ఐదేళ్ల క్రితం అనుకుంటా, రేడియోలో ఓ కార్యక్రమం ప్రసారం అయ్యేది--అందులో ఒక పాటని ప్రసారం చేసేవారు. శీర్షిక "సినిమాలో మాత్రమే వినిపించిన పాట" అనో యేదో వుండేది. (అంటే బయట "హిట్" కాని, మంచి పాట అని అనుకుంటా వాళ్ల వుద్దేశ్యం). 

ఆ శీర్షికలో నాకు బాగా జ్ఞాపకం వున్న పాట, "బ్రహ్మ పట్నం పోదమంటే దారి తెలియదు అన్నయా! సూటిగా చుక్కానిపట్టీ నావ నడపవే చెల్లెలా!" అనేది. తరవాత ఇంకోపాట--"దేవీ సేమమా? దేవరవారూ సేమమా?" అనే పాట అని గుర్తు. 

మొదటి పాట సంగతి నాకు గుర్తులేదు గానీ, రెండో పాట వ్రాసినది మాత్రం, మా గురువుగారు, "ఆచార్య ఆత్రేయ"! అప్పట్లో ఓ జోకుండేది--కృష్ణశాస్త్రి వ్రాసి (జనాలని) యేడిపిస్తే, ఆత్రేయ వ్రాయక (నిర్మాతలని) యేడిపిస్తాడు--అని! ఇంకా, ఆత్రేయకి ఓ 5స్టార్ హోటల్లో బసయేర్పాటుచేసి, ఓ వారంపాటు జాగ్రత్తగా చూసుకొంటే (ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ నిరంతరాయంగా అందిస్తే) ఓ వారంలో ఖచ్చితంగా ఓ "హిట్" పాట వస్తుంది అని! (అదే స్కాచ్ బదులు ఇండియన్ విస్కీ అందిస్తే, ఇలాంటి పాటలే వస్తాయి అని కూడా చెప్పుకునేవారు!). ఇవన్నీ "పాప్యులర్ గాసిప్సే" అయ్యుండవచ్చు. తరువాత ఆయన "కోడెనాగు" సినిమాలో శోభన్ బాబుకి గురువుగా నటించారు కూడా.

ఇంకో గొప్పపాట, ఎస్ పీ కోదండపాణి పాడిన "ఇదిగో....దేవుడు చేసిన బొమ్మా....ఇది నిలిచేదేమో మూడురోజులు, బంధాలేమో పదివేలు!". చాలా మంచి పాట. ఆ విధంగా ఆయన తప్ప ప్రపంచంలో యెవరూ పాడలేరు మరి!

అలాగే, హిందీ గీత రచయిత "ఆనంద్ బక్షీ" ఉప్ హార్ అనే సినిమాలో ఓ పాట పాడారు--"బాగోం మే బహార్ ఆయీ, హోఠోం పే పుకార్ ఆయీ, ఆజా, ఆజా, ఆజమేరి రాణీ" అంటూ. అది కూడా అనితర సాధ్యం!

ఎస్ డీ బర్మన్ పాతకాలంలో పాడిన ఓ పాట వుంది--"ధీరెసె జానా ఖటియన్ మే, ఓ ఖట్ మల్, ధీరెసెజానా ఖటియన్ మే!" అనో, "ధీరెసెజానా బగియన్ మే, ఓ భౌఁరా, ధీరెసెజానా బగియన్ మే!" అనో!

ఇలాంటి చమక్కులు ఇప్పుడు లేవు!

ఇప్పుడన్నీ "ఓయ్, ఓయ్"; "డోయ్, డోయ్" లే మరి!


Thursday, September 1, 2011

రసఙ్ఞత



రసన

మనుషులకి (జంతువులక్కూడా) వుండే అవయవాల్లో ఈ రసన అనబడే నాలుక, ఓ అతి విచిత్రమయిన అవయవం.

మరి దానికి తోడు "అంగుడి"!

నాలుకమీదవేసుకోగానే, పదార్థం రుచిని గ్రహించి, దాన్ని అంగుడికి హత్తగానే--ఓహ్! ఇదే స్వర్గం అనిపించేలా చేస్తాయి ఈ రెండూ!

ఇంగ్లీషువాళ్లు కూడా రుచి ని చెప్పడానికి "ప్యాలటబుల్"; "ఫర్ ది ప్యాలేట్"....ఇలా వాడతారు. అదీ అంగుడి ప్రాధాన్యం.

ఆ రెండూ లేకపోతే, మనం కూడా ఆకులూ, అలమలతోపాటు, మట్టీ, మశానమూ తింటూ వుండేవాళ్లం!

సాహిత్యంలో ఈ రసనకి ఓ విశిష్ట స్థానం వుంది. అనేక పద్యాలు వున్నాయి. "వివాహభోజనంబు" లాంటి పాటలూ వున్నాయి. 

ఈ సందర్భంలో నాకో విషయం గుర్తొచ్చింది.

మా హైస్కూల్లో వుత్తరాంధ్రనుంచో, దక్షిణాంధ్రనుంచో ఇద్దరు ఆడపిల్లలు కొత్తగా చేరారు యేదో చిన్న క్లాసులో. మాకన్నా చిన్నవాళ్లు, అక్కచెల్లెళ్లు. ఆ సంవత్సరాంత  సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ ప్రదర్శన ఇచ్చారు.

తెల్లటి పొడుగుచేతుల చొక్కాలూ, షరాయిలూ వేసుకొని, కుచ్చు తలపాగాతో, చేతిలో కంజరి లాంటి డప్పులతో (కాళ్లకి గజ్జెలు కూడా కట్టుకున్నారేమో) ఓ చక్కని సరదా పాట పాడారు. విషయం సరిక్రొత్తదవడంతో, అందరూ తలమునకలుగా ఆనందించారు. ఆ పాట ఇలా సాగుతుంది--నాకు ఙ్ఞాపకం వున్న రెండుమూడు లైన్లు......

(ఒక వూరికి)"......వచ్చారూ ముగ్గురు షరాబులూ.....ఒకడికి అంగుడేలేదూ, ఇద్దరికి మింగుడేలేదూ"

"అంగుడి మింగుడు లేనివారలూ దున్నారూ మూడెకరాలూ.....ఒకడికి అరకేలేదూ, ఇద్దరికి యెడ్లే లేవూ"

"నాగలి యెద్దులు లేనివారలూ వేశారు మూడు విత్తనాలూ....ఒకటి యెండేలేదు, రెండు పండేలేదు!"

.......అలా సాగుతుంది. (పైన వ్రాసినవికూడా కరెక్టు కాకపోవచ్చు!)

వాళ్లు ఈపాటికి బ్లాగులు చదువుతూ, వ్రాస్తూ వుండి వుంటారని నా అంచనా.

యెవరికైనా ఈ గీతం/గేయం తెలిస్తే, వెంటనే పూర్తిగా ప్రచురించండి.....అందరికీ పరిచయం చెయ్యండి.

బుర్రుపిట్ట పాటల్లాగే, ఇదీ సాహిత్య సేవే! 

Sunday, July 3, 2011

అన్నమయ్య సాహిత్యం.....

 .....తి తి దే ప్రాజెక్టూ

నా ఈ ఆంతర్యం (బ్లాగు)లో "ముద్దు కారే" టపా వ్రాసిన నెలా పదిహేనురోజులకి ఓ స్పందన వచ్చింది వులిమిరి సూర్యనారాయణ గారి నుంచి. అంతలో మరో స్పందన--లలిత గారి నుంచి! ఇద్దరూ మంచి సమాచారం ఇచ్చారు. వులిమిరివారైతే, గరిమెళ్ల వారి పాటల లింకు రూపంలో వో ఖజానానే ఇచ్చారు. లలితగారు పిల్లలకోసం మంచి బ్లాగ్ నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ నా ప్రత్యేక అభినందనలు.

కానీ--నేను విమర్శిస్తూవస్తున్నది తి తి దే వారి సోకాల్డ్ అన్నమాచార్య ప్రాజెక్టునీ, అందువల్ల తెలుగు వాళ్లకి వొనగూడిన "ప్రయోజనాన్నీ"! ఆ ప్రాజెక్టూ, వాళ్లు పరిష్కరించామని చెప్పుకుంటున్న అప్పటి తెలుగు లిపి గురించీ! నా ఇదివరకు టపాలలో, "పదివేల శేషులు" యెక్కడనించి వచ్చారూ? "పన్నగంపు" అంటే యేమిటీ? "దోమతెరలు" అప్పుడు వున్నాయా?--ఇలాంటి వాటి గురించి వ్రాశాను. మెచ్చుకున్నవాళ్లు మెచ్చుకున్నారు. ఇప్పుడే కాస్త "సబ్జెక్ట్" వున్నవారి స్పందనలు వచ్చాయనుకుంటా.

నా బాధంతా, పాతకాలంలో కూడా వాళ్లకి "అందుబాటులోవున్న పరిమిత" వనరుల ఆథారంగా, మల్లంపల్లివారూ, రాళ్లపల్లివారూ, తాపీ వారూ, తూమాటివారూ, అక్కిరాజువారూ--మనకి తెలియని, యెప్పటికీ తెలుసుకోలేని, పాళీ, పైశాచీ, ప్రాకృత, ప్రాచీన తెలుగు లాంటి భాషలలో వున్న శాసనాలూ వగైరాలని, "మనకి అర్థం అయ్యేలా, సంతృప్తి కలిగేలా" వివరించగలిగారు.

మరి "జాను తెనుగు"లో వ్రాసిన అన్నమయ్య కీర్తనలని, సామాన్య భక్తుల మనోభావాలని ప్రతిబింబిస్తూ, వ్రాసిన అన్నమయ్య కీర్తనలు అర్థం లేనట్టుగా, మనకి అర్థం కానట్టుగా యెందుకు పరిష్కరించారు? వాటిని మనం గుడ్డివాళ్లలా అనుసరించాలా? ఇవీ ప్రశ్నలు.

మేము హైస్కూల్లో వున్నప్పుడు, మా తెలుగు పాఠ్య గ్రంధాల్లో, "కమలాక్షునర్చించు కరములు, కరములు" లాంటి పద్యాలూ, అందులో అలంకారాలూ చదువుకున్నాము. అలాగే అప్పటికి అందుబాటులో వున్న కొన్ని అన్నమయ్య కీర్తనలగురించీ, ఆయన జీవితం గురించీ, 32 వేలకు పైగా కీర్తనలు వ్రాశాడనీ, వాటిని ఓ రాజుగారు రాగిరేకులమీద వ్రాయించి భద్రం చేశాడనీ చదువుకున్నాము. వాటిలో సందేహాలేమాత్రం లేవు.

మరి శోభారాజులు ప్రాచుర్యంలోకి తెచ్చిన "అదివో! అల్లదివో"; "విన్నపాలు వినవలె"; "ముద్దుకారే యశోద" లాంటి కీర్తనల్లోనే యెందుకు సందేహాలు వస్తున్నాయి? గరిమెళ్లవారుగానీ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గానీ, లతా మంగేష్కర్ గానీ, మంగళంపల్లి గానీ--తమకి అందుబాటులో వున్న "సాహిత్యానికి" ట్యూన్లు కట్టి, వీనులవిందుగా పాడారేగానీ, ఆ సాహిత్యాన్ని "ప్రశ్నించే" ప్రయత్నం చెయ్యలేదు! చాపక్రింది నీరులా, ఆ "సాహిత్యమే" వ్యాపించి, పూజలందుకొంటోంది!

నాకు తెలిసీ, తెలుగు సాహిత్యంలో విశ్రాంతి యెరుగకుండా, అలుపన్నది లేకుండా, (తనకి అంత సమయం యెలా వచ్చేదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే!)  కృషి చేసినవాడు "ఆరుద్ర!" ఆయన "సమగ్రాంధ్ర సాహిత్యం", "నిఘంటువు", "వేమన్న వేదం" లాంటి యెన్నో "బృహద్గ్రంధాలని" వ్రాశాడు. (నేనేమీ ఆరుద్ర అభిమానిని కాదు. ఇంకా అంటే "కె రా" అభిమానిని!).

వుదాహరణకి, ఆయన వ్రాసిన వేమన్న వేదంలో ప్రతీ పద్యానికీ, "మదరాసు ప్రాచ్య లిఖిత భాండాగారం" లోని 54 సంపుటాలలో వున్న పద్యాలనే "ప్రామాణికంగా" తీసుకొన్నాడు. పైగా, వాటిని "బ్రౌన్ దొరగారు" సేకరించిన పద్యాలతోటీ, ఆయన నిఘంటువులోని పద "అర్థాల"తోటీ బేరీజు వేస్తూ, ఆయన రచన కొనసాగించాడు. వుదాహరణకి లలితగారు తమ ఆంతర్యంలో పెట్టిన, అంతర్జాతీయంగా ప్రతి తెలుగువాడూ ఇప్పుడు అదే సరియైనది అనుకుంటున్న "అనువుగాని చోట" పద్యం తీసుకొంటే, వేమన వ్రాసిందీ(?!), ఆరుద్ర చెప్పిందీ--అసలు పద్యం.......

"అనువుగానిచోట నధికులమనరాదు, యొదిగి యొక్కవంక నుండవలయు, మర్రియాకుపైన మాధవుడుండడా? విశ్వదాభిరామ వినురవేమ!"

ఇదీ అసలు పాఠం! (ఇలాంటివి కొన్నివేలున్నాయి--శ్రధ్ధ పెడితే!)

(అప్పట్లో తమిళనాడుని "మదరాసు" రాష్ట్రం అనేవారు. దాని ముఖ్యపట్టణం (నేటి చెన్నై) ని కూడా "మదరాసు" అనే అనేవారు. ఆరుద్ర చెప్పిన "ప్రాచ్య లిఖిత భాండాగారం", తంజావూరులో నెలకొన్న "సరస్వతి మహల్" వొకటేనో వేరువేరో నాకు తెలీదు).

కానీ, "వెయ్యేళ్ల ప్రాచీన భాష" గా తెలుగుని గుర్తించి, కేంద్రం ఇచ్చిన యెన్నో కోట్లతో మనం యేమి చేశామో? కనీసం ఆ ప్రాచ్య లిఖిత భాండారాల్లోనుంచి మన "తెలుగు" కి సంబంధించిన "తాళ పత్రాలనీ", ఇతర "అముద్రిత" గ్రంధాలనీ మన "రాష్ట్రానికి" తెచ్చుకున్నామా? కనీసం ప్రయత్నం చేశామా?

అమెరికలో "తానా" మహాసభలూ, ఇంకేవో (చిట్టెన్ రాజుగారన్నట్లు 'తంతా') సభలూ వగైరా నిర్వహిస్తున్నాం. కానీ, "యెవరాతల్లి? యెవడికి తల్లి?" అన్నవాణ్ని యేమంటాము?

......తరువాయి మరోసారి.

Wednesday, May 18, 2011

అన్నమయ్య కీర్తనలు



ముద్దు కారే....

అప్పటికి మూడున్నరేళ్ల నా మనుమడు మా యింటి ముందున్న, వేంకటేశ్వర స్వామి గుళ్లో, ప్రతిరోజూ వాయించేస్తున్న ఈ కీర్తనని వింటూ, ఓ రోజు పాడేశాడు...."ముడ్డికారే యశోద....." అంటూ! వాడి తప్పేమైనా వుందా?

మన తితిదే వారు కొన్ని పదుల సంవత్సరాల క్రితమే, కొన్ని కోట్ల ఖర్చుతో "అన్నమాచార్య ట్రస్ట్" స్థాపించి, కొంతమందిని ఆయన కీర్తనలని తాళ పత్రాల్లోంచీ, రాగి రేకుల నుంచీ "దీ కోడ్" చెయ్యమని నియమించారు. 

ఆ "పరిశోధకులు" యెస్వీ యూనివర్సిటీ నుంచి "డాక్టరేట్లు" తెచ్చుకున్నారు--వాటిని పరిష్కరించడమే కాదు--తమకి తోచిన రాగ, తాళ, లయ లతో, పాడేశారు కూడా. వొక్క (ఛార్లెస్ కాదు) శోభారాజు గురించేకాదు నేను వ్రాస్తున్నది.

(నా చిన్నతనంలోనూ, నేను పుట్టక క్రితం కూడా, మల్లంపల్లి వారూ, తాపీ వారూ, తూమాటి వారూ, అక్కిరాజు వారూ.....ఇలా చాలా మంది, తమకి అందుబాటులో వున్న "పరిమిత" వనరులతో, "సిధ్ధాంత" వ్యాసాలు వ్రాశారు. దానిగురించి మరోసారి.)

అన్నమయ్య, తాను వ్రాసిన ప్రతీ గేయానికీ/గీతానికీ, నిర్దిష్టంగా ఓ రాగాన్ని, తాళాన్ని (మన ప్రాచీన వాగ్గేయకారులు త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితర్ ల లాగ) నియమించారు. 

శంకరాభరణం శంకరశాస్త్రి చెప్పినట్టు, మన "పరిశోధకులు" తమ "మిడిమిడి" ఙ్ఞానంతో వాటిని "భ్రష్టు" పట్టించారు! దానికి మన ప్రభుత్వ, తితిదే వారి ప్రోత్సాహం తోడు!

ఇంతకీ, అన్నమయ్య వ్రా/డిన ఈ గీతం యేమిటీ?

"ముద్దుకాడే! యశోద ముంగిటి ముత్యము వీడు" అని. 

అంటే, ఇక్కడ "శ్లేష"....ముద్దు కాడా? అనీ, "ముద్దుకాడు"--చెలికాడు, విలుకాడు, వన్నెకాడు--ఇలా (అంతేగాని కన్నడంలో లా కాడు అంటే "అడవి" అనీ, మన తెలుగులోలా "వల్లకాడు" అనీ కాదు!) ముద్దువచ్చేవాడు అని. 

మరి ముద్దు "కారడం" యేమిటి? అందులోనూ యశోదకి?

ఇప్పటికైనా సరిదిద్దండి--పాడేవారూ, వినిపించేవారూ వగైరాలు.

Friday, May 6, 2011

తెలుగు హాస్య సాహిత్యం-2



"గణపతి"

(ఇలా వ్రాసి, క్రింద "గణపతి" లోని ఆ భాగాన్ని ప్రచురిస్తే బాగుంటుందని ఇది తయారు చేశాను. కానీ, కొంచెం సస్పెన్స్ వుంటే బాగుంటుందేమో అనిపించి, ఆ భాగాన్ని ముందు ప్రచురించాను.) 

నేను నా జిన్నతనముననే వావిళ్లవారో నెవరో బ్రచురించిన జిలకమర్తివారి గణపతి ని జదివితిని. తరువాత, నా యున్నత విద్యా కాలమున మరల "ఎమెస్కో" (ఇది నామవాచకమైనందున బదము మొదటి యచ్చు దప్పదు!) వారో మరి యెవరో బ్రచురించిన గణపతిని మరలజదివితిని. అదే కాలములో నాకాశవాణి ద్వారా బ్రసారము కాబడిన నండూరి వారు గణపతిగా నటించిన (శ్రవణించిన) యా నాటకమో, నాటికనో--బలుసార్లు వింటిని. టేపురికార్డరను నొక సాధనము (అన్వేషణ యను జలన చిత్రమున జూపించినటువంటిది) నాదగ్గరుండుటచే, ఆ "రేడియో" నాటికను "రికార్డు"జేసుకొని, మరల మరల వినియానందించుచుంటిమి మా యింటిల్లపాదియును!

మొన్ననీమధ్యన "విశాలాంధ్ర" వారు "చంద్ర"యనునొక నార్టిస్ట్ వ్రాసిన (గణపతి తన బొగజుట్ట నుండి వెలువరించుచున్న బొగతో "గణపతి" యని వ్రాసినట్లు బ్రచురించిన ముఖజిత్రముతో) పునర్ముద్రించిన బుస్తకమునుగూడా గొంటిని. నా "యింటి గ్రంధాలయమున" బ్రస్తుతమా బుస్తకమున్నది.

నా దెలుగు బ్లాగ్మితృలకునోజిన్న గానుకనొసంగగోరి, నీక్రింది టపాను బ్రచురించుచున్నాను. 

(తెలుగు బ్లాగ్ మితృలూ, బ్లాగ్ పోలీసులూ, పైన వ్రాసిన వాక్యాల్లోని "అచ్చులనీ, హల్లులనీ", "పరుషాల"నీ, "సరళాల"నీ వాటి "స్థానాలనీ" గమనించగోర్తాను. అరసున్నాలుండవలసిన చోట అవి వ్రాయడానికోపిక లేక వదిలేశాను. దయచేసి అవి వున్నట్టే భావించవలసినదిగా ప్రార్థన.)

"గణపతి" ప్రథమ భాగము, నాల్గవ ప్రకరణము, నుండి (నేను జదివిన, విన్న, యంశములుమాత్రమే, యథాతథముగా) వ్రాయుచున్నాను....నా బ్లాగు సహోదరులవధరింప బ్రార్థన.

....తరువాయి మరియొకసారి.

Thursday, May 5, 2011

తెలుగు హాస్య సాహిత్యం




ఇది చదివారా?

"వివాహ సంబంధములైన వేడుకలు విశేషముగా వర్ణింపదలచుకొనలేదు. అయినను, ముఖ్యమైన వొకటి రెండు గలవు. పప్పుభొట్లవారితో నన్నంభొట్లవారు వియ్యమందినప్పుడు వారి కుభయులకు ననాది బంధువులైన నేతివారు దయచేసి వారితో గలసి మెలసి వివాహమునకెంతో శోభదెచ్చిరి. నేతివారుగాక ముఖ్యముగ నన్నంభొట్ల వారికి బంధువులైన కందావారు, చెమ్మకాయలవారు, బీరకాయలవారు, చేమకూరవారు, వంకాయలవారు, మిరియాలవారు, దోసకాయలవారు దయచేసి, రేయింబవళ్లు తిరిగి, రెక్కలు ముక్కలగునట్లు పనిచేసి మెప్పువడసిరి. ఉప్పువారు మొదటినుండియు నచ్చటనేయుండిరి. కాని వారికన్నంభొట్లవారితో నంతయైకమత్యము లేదు. ఉప్పువారికిని మన పప్పువారికిని నతికినట్లన్నంభొట్లవారితో నతకదు. ఉప్పువారికిని బంధుమిత్రులకుగూడ నెక్కువ కలయిక యుండెను. గొల్లప్రోలు నుండి చల్లావారు మొదట నేకారణముచేతనో రాక కడపట విచ్చేసిరి. కడపట విచ్చేసిననను మొదటి నుండియు నన్నంభొట్లవారికాప్తులగుటచేత వారి సమాగమ మెంతో రసవంతముగ నుండెను"  

Saturday, April 30, 2011

యేకవచన ప్రయోగం



తెలుగు వారికి నా విఙ్ఞప్తి

తెలుగువారికీ, ముఖ్యంగా తెలుగు బ్లాగరు సోదరులకీ, నేను సంస్కృత/తెలుగు వ్యాకరణాలూ, ఇంగ్లీషు గ్రామరూ బోధిస్తున్నాను అనుకోక, నా చెప్పు ముక్కలు తమ చెవిని వేసుకొని, ఆలోచించమని ప్రార్థన. 

సంస్కృతంలోనైనా, తెలుగులోనైనా, నామవాచకాలు, సర్వనామాలూ వగైరాలు వున్నాయి. నామ వాచకమంటే, ఓ వ్యక్తి, వస్తువు లకు వ్యవహరింపబడే పేర్లు. సర్వనామాలంటే, ఆ నామవాచకాలని మళ్లీ మళ్లీ చెప్పవలసిన అవసరం లేకుండా, ప్రత్యామ్నాయంగా వాడే పదాలు.

ఓ నామవాచకం యొక్క స్థితిని తెలియచెయ్యడానికి సంస్కృతంలో "శబ్దాలూ", తెలుగులో "విభక్తులూ" వున్నాయి. అదే ఇంగ్లీషులో ఆ స్థితి వాచకాలు కూడా భాషా భాగాల్లో ఒకటిగానే వున్నాయి.

వుదాహరణకి, సంస్కృతంలో "రామః = రామ నామం కల వ్యక్తి". అదే తెలుగులో, "డు, ము, వు, లు--ప్రథమా విభక్తి" చేరి, "రాముడు" అవుతుంది ఆ వ్యక్తి పేరు. (ఛీ! యేకవచనమేమిటీ? శ్రీ రాములవారు.....అనాలి అందామా? ఈనాడు వారిలాగ?)

రాముని (ద్వితీయ), చేత (తృతీయ), కొరకు (చతుర్థీ), వలన (పంచమీ), కి, యొక్క (షష్ఠి), యందు (సప్తమీ)--కాకుండా "వాణ్ని" పిలవాలంటే, "ఓ రామా!"; "ఓరి రామా"; "ఓయి రామా" అనీ, అదే సీతనైతే, "ఓసి సీతా" అనే పిలవాలి--మన తెలుగు వ్యాకరణం ప్రకారం!

అంతేగాని, "రాములూ" వగైరా బహువచన ప్రయోగం యెందుకు?

అదే ఇంగ్లీషులో అయితే, 'ప్రిపొజిషన్స్' అని భాషాభాగాల్లోనే చేర్చుకొన్నారు వాళ్లు. "బై రామా", "ఫర్ రామా" ఇలాగ.

గత కొన్నేళ్లుగా, ప్రైవేటు కళాశాలలవాళ్లు "స్కోరింగు" సబ్జెక్ట్ గా సంస్కృతం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారట. మరి ఆ విద్యార్థులు ఆ "శబ్దాలనీ" వాటినీ సరిగ్గా వుచ్చరించగలుగుతున్నారో, వ్రాయగలుగుతున్నారో లేదోదానీ, మార్కులు మాత్రం వచ్చేస్తున్నాయట. అదే తెలుగులో 40 వేలమందికి పైగా "సున్నాలు" తెచ్చుకొన్నారట! రావూ మరి?! సంస్కృతం "రాని" మేష్టర్ల కన్నా, తెలుగు "రాని" మేష్టర్ల సంఖ్య యెక్కువ! 

మరి సర్వనామాలు, తెలుగులో, "అతడు, అమె, అది, ఆ" అనేవి. ఇంగ్లీషులో, "హి, షి, ఇట్, దె" అనేవి. 

తెలుగులో గ్రాంథికంలో అతడు, ఆమె అనేవి వాడినా, వ్యావహారిక భాషలో, వాటికి ప్రత్యామ్నాయంగా, వాడు,అది వారు/వాళ్లు అనే ప్రయోగాలు వచ్చేశాయి.

తెలుగు సాహిత్యం లో కూడా, భగవంతుణ్ని అయినా, వాడు, వీడు అనే అంటారు. "కలడు, కలండనెడి 'వాడు' కలడో, లేడో!" అనీ, "బ్రోచేవారెవరు 'రా'..." అని!

ఇంగ్లీషులో కూడా, వుదాహరణకి, "జీసస్ ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. హి (వాడు/అతడు) శాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఆన్ ది క్రాస్" అంటారు కదా?

"మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్నే ఆయుధం చేసుకొన్నాడు. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు".....అంటారు గానీ, "మహారాజశ్రీ మహాత్ములవారు గాంధీగారు"....చేసుకొన్నా"రు"....తెచ్చా"రు" అంటారా?

ఇక, వా 'రు'; తమ'రు' లాంటి ప్రయోగాలు మన బానిసతనానికి చిహ్నంగా భాషలోకి ప్రవేశపెట్టబడ్డవి. అప్పటి దేశపాలకులని, అప్పటి బానిస వ్యక్తులు అనవసరంగా కీర్తిస్తూ వాడిన పదాలవి. "సర్" ని "అయ్యా"/"ఆర్యా" అనీ;(మ్‌లేఛ్ఛుడు ఆర్యుడు యెలా అవుతాడు?) "నువ్వు" (ఇంగ్లీషులో యు) ని మీ'రు' అనీ, మళ్లీ ఆ మీరు ని తమ 'రు' అనీ; "ఘనతవహించిన"; "మహాఘనతవహించిన"; "శాయంగల విన్నపములు"; "దయయుంచి" (ప్లీజ్); "కరుణతో" (కైండ్లీ); "దఖలు"/"దాఖిలు"/"దాఖలు" చేస్తున్నాను (సబ్మిట్); (హిందీలో దాఖిల్ కర్నా అంటే విన్నపం చేస్తున్నాను, లేదా, మీ దృష్టికి తెస్తున్నాను/సమర్పిస్తున్నాను అని). 

ఇవన్నీ అవసరమా? 

{ఇప్పటి ఆఫీసుల్లో కూడా, ఇంగ్లీషులో యేదైనా వ్రాస్తే, దాంట్లో యెన్ని 'రిక్వెస్టులూ', 'ప్లీజ్ లూ', 'కైండ్లీలూ', 'సబ్మిట్ లూ' వున్నాయో చూసుకొని, పైన 'రెస్పెక్టెడ్' వుందా లేదా చూసుకొని, చివర థాంకింగ్ యూ తరవాత "సర్" వుందా లేదా చూసుకొని, అవన్నీ లేకపోతే, "వీడు వొట్టి (స్వంత చిరునామా లేనివాళ్లని--కేరాఫ్ గాళ్లనీ 'అనామకం గాడు (నస్మరంతి)' అనే అనుకుంటా బాపూ-రమణలు అన్నది) ఇన్ సబార్డినేట్ గాడు" అని ముద్రవేసేస్తారు!}

చెప్పొచ్చేదేమిటంటే, మనం ఇంగ్లీషు వాళ్లమూ కాదు, భారతీయులమూ కాదు, తెలుగు వాళ్లమూ కాదు--ఓ ప్రత్యేక జాతి! 

ఈ దౌర్భాగ్యాలు మనని వదిలేదెప్పుడో??!!

Tuesday, April 26, 2011

తెలుగు సినీ.....-4



......శంకరాభరణం

ఇంక, చిత్ర విజయానికి దోహదం చేసిన సంగీతం (మహదేవన్), సాహిత్యం (వేటూరి) ల గురించి కొంచెం.

మహదేవన్, మనం యే మాటలు వ్రాసేసినా, వాటికి ట్యూను కట్టెయ్యగలడు. గమనించవలసిందేమిటంటే, రాజేశ్వరరావు, పెండ్యాల మొ. వారు కట్టిన పాటల్లో, పల్లవీ, చరణాలూ వుండేవి. కానీ, చరణాలు అన్నీ ఒకే వరసలో వుండేవి! మహదేవన్ మాత్రం, మాటల్ని ఇష్టం వచ్చిన వరసల్లో, వాయించేస్తాడు....ఓ వరస క్రమం లేకుండా!

వేటూరివారు--సహజకవి! అలతి అలతి పదాలతో.......అని ఇంతకు ముందే వ్రాశాను. "తొలిసంజ వేళలో, తొలిపొద్దు పొడుపులో, వినిపించే రాగం భూపాలం.....కనిపించే వర్ణం సింధూరం" (రచయిత దా. నా. రా.) పాటని ఘోస్టుగా ఈయనే వ్రాశాడు అని చెవులు కొరుక్కొంటారు సినీ పండితులు.

ఈ సినిమాకోసం చక్కటి పాటలు వ్రాశాడు. 

మొదటిగా, "ఓం! ఓం! ఓం! ఓంకారనాదానుసంథానమౌ రాగమే...శంకరాభరణమూ...." బాగుంది. శంకరాభరణ రాగం ఓంకారనాదానికి అనుసంధానమట. 

"శంకర గళ నిగళము" అంటే శంకరుడి గళాన్ని (కంఠాన్ని) పట్టుకొని, వ్రేళ్లాడేది--పాము! సరే.

"శ్రీహరి పదకమలమూ...." ఇదేమిటీ? శ్రీహరి పాదాలదగ్గర కమలం లా వుండేది....అనా? అంటే, ఆది శేషుడు అని కాబోలు కవి హృదయం!

"రాగ రత్న మాలికా తరళము...." అంటే, రాగాలు అనే రత్నాలు అన్నీ మాలికగా కూర్చితే, ఆ దండ 'తేలుతూ' వుండే రాగం--శంకరాభరణం అని. బాగుంది కదూ!

"శారద వీణా రాగ చంద్రికా...పులకిత శారద రాత్రము, నారద, నీరద, మహతీనినాద, గమకిత శ్రావణ మేఘము!"

అహో! యెంత గంభీరం! సరస్వతి వీణలోపలికే రాగ చంద్రికలతో పులకితమైన శరద్రాత్రి (లో), నారదుడి మహతి నాదం చేస్తుంటే, నీరదమైన శ్రావణమేఘము గమిస్తూందట....(పాములా!).

"రసికులకనురాగమై, రసగంగలో తానమై, పల్లవించు--సామ వేద మంత్రము--శంకరాభరణమూ"!

అంటే??!! యేమో. పాములకీ, శంకరాభరణ రాగానికీ, ఈ మాటలకి యెలా సమన్వయం కుదురుతుందో అర్థం కాలేదు--ఒక్క సామవేద మంత్రము పల్లవిస్తుంది అని తప్ప.

ఇలా ప్రతీ పాటనీ అర్థ తాత్పర్యాలు గ్రహించడానికి ప్రయత్నిస్తే......ప్చ్! వుపయోగమేమిటి!

కానీ, ఒక విషయం. సందర్భం వివరించి, దానికి తగ్గ పాట వ్రాయమంటే, పాపం చాలా కష్టపడి అలాగే వ్రాశాడు. వాటిని సినిమాలో వాడుకోవడమే.....ఇష్టం వచ్చినట్టు చేశాడు దర్శక యెడిటర్.

సినిమా యెత్తుగడలో భాగంగా, శం. శా. "క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్" కోసం, ఆయన ప్రఖ్యాతినీ, ఆయన వైదుష్యాన్నీ, ఆయనకి ఆ రాగమంటే వుండే ఇష్టాన్నీ, జనం నీరజనాలు పట్టడాన్నీ చూపించవలసిన "టైటిల్ సాంగ్" ని, జమీందారు కుర్చీలాగడానికీ, మం. భా. ని రేప్ చెయ్యడానికీ....ఇలా వుపయోగించుకోవడం యేమి బాగుంది?

"దొరకునా ఇటువంటిసేవ...." పాట, తులసి ఆయనకి శుశ్రూష చేస్తూ, సంగీతం నేర్చుకొనే సందర్భంలో వ్రాసినది. అది క్లైమాక్స్ పాట అయి కూచుంది.

"రాగం, తానం, పల్లవీ.....కడతేరమన్నవి" అనే పాట క్లైమాక్స్ కోసం వ్రాసినది. మధ్యలో ఇంకో కచేరీలో దూరింది.

క్యామెడీకోసం, కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను అని పట్టాభి చేత చెప్పించి, వెరయిటీగా "బ్రోచేవారెవరురా..." కీర్తనని పాడించి, (ఇలా చెయ్యకూడదు అని చెప్పడానికి అలా చెయ్యడమే చూపిస్తూ!), సంగీతోధ్ధరణ కోసం, దాన్ని మళ్లీ శం. శా. చేత పాడిస్తూ, తులసి నేర్చుకున్నట్టు చూపించవలసి వచ్చింది!

"సామజవర...."ని మధ్యలో చరణాలు చొప్పించి, రొమాన్సు కోసం చూపించడం జరిగింది.

ఆయన "ఫ్రస్ట్రేషన్"తో "శంకరా, నాదశరీరా" అంటూ వర్షంలో చిందులు వెయ్యడం కోసం వుపయోగించబడింది ఆ పాట.

యెంత సమర్థంగా వినియోగించుకున్నాడో చూడండి పాటలన్నిటినీ!

నిజానికి మొదటిసారి చూసినప్పుడు యెవరికీ అర్థంకాదు ఈ సినిమా. అందుకే మొదటివారం కలెక్షన్లు నిల్లు. తరవాత పాటలు హిట్ అవడంతో, (మొదట్లో పాటలు రేడియోలో విన్నవాళ్లు అవి మంగళంపల్లి వారు పాడారనుకున్నారు చాలా మంది. అంత గొప్పగా పాడాడు బాలు అని చెప్పడమే నా వుద్దేశ్యం.) క్యామెడీ, రొమాన్సూ, కీర్తనలూ, సంగీతోధ్ధరణ డైలాగులూ, సందర్భాలూ బాగా పండడంతో, అక్కడనించీ రజతోత్సవం దాకా వెళ్లిపోయింది ఈ సినిమా.

దానికి ముఖ్య కారణం--హీరో శంకర శాస్త్రే. మూస కథలతోటీ, మొహం మొత్తిన హీరోలతోటీ, సినిమాలు వస్తున్న రోజుల్లో, ఆయనని హీరోగా పెట్టి సినిమా తియ్యడం ఓ సాహసమే. అదే నచ్చింది జనాలకి.

తరవాత, మహదేవన్ సంగీత నిర్వహణ. విమర్శకులకి బాగా నచ్చిన వేటూరి వారి సాహిత్యం. వెరైటీ హీరోయిన్ మంజు భార్గవి. చంద్రమోహన్, అల్లు, సాక్షి ఇలా కొంతమంది తప్ప అందరూ కొత్త నటీ నటులే కావడం. (వాళ్ల స్థానంలో కూడా కొత్తవాళ్లని పెడితే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.) తులసి అబ్బాయి వేషం బాగా కుదరడం.

ఇలా అన్నీ కలిసొచ్చాయి.      

.........తరువాయి ఇంకోసారి.

Saturday, April 23, 2011

తెలుగు సినీ.....-3



......శంకరాభరణం

ఇంతాచేస్తే, రషెస్ చూస్తే,సినిమా అరగంటకూడా రాలేదు.

ముఖ్యమైన క్యారెక్టర్లు--శం. శం. శా., మం. భా., వాళ్లమ్మా, జమీందారూ, కొంతమంది కచేరీ నిర్వాహకులూ (జూనియర్ ఆర్టిస్టులు), శం. శా. కూతురూ (ఓ చిన్న పిల్ల--తరవాత రాజ్యలక్ష్మి అవుతుంది), అబ్బాయి (తులసి)--అంతే! 

మరి బాగా ఆడాలంటే, సగటు సినిమాకి అవసరమైన "క్యామెడీ" యేదీ? "రొమాన్సు" యేదీ? కళాఖండం అనిపించుకోవాలంటే, "సపోర్టు" యేదీ? (ఇంకోగంట సినిమా తియ్యొచ్చుకదా? ఇవన్నీ కూడా కలిపేస్తే పోలా!) అనుకొన్నాడు. 

అప్పుడొచ్చాడు--యెవరూ? ఆయన చిన్నప్పటి స్నేహితుడినంటూ అల్లు రామలింగయ్య. కొన్ని లింకులు కుదిరాయి--'తమిళ తంబిలకీ, కన్నడ సహోదరులకీ మాటిచ్చేశాను--కచేరీ జరిపించాల్సిందే, తరవాత నీ యిష్టం;' అంటూనూ, 'అమ్మయిని అన్నవరం పంపిస్తున్నావు. అంతే;' అంటూనూ, 'పెళ్లి చూపులకి వాళ్లొస్తారు, తరవాత నీ యిష్టం'--అంటూ. (అది క్యామెడీ). (అప్పటికి శం. శా. భార్యని కూడా చూపించినట్టు గుర్తు. ఆవిడ యెప్పుడు యెలా పోయిందో తెలీదు). 

మరి రొమాన్సెక్కడా? ఆయన కూతురు పెద్దదయి, రాజ్యలక్ష్మిగా అవతరించి, చంద్రమోహన్, నిర్మలా, చెంబుసీన్లూ, "సామజవరగమనా" పాటా! "ఆ వృషభం...." అంటూ మళ్లీ క్యామెడీ! చీల్చి చెండాడాడు ఆయన క్యారెక్టరు ప్రకారం సోమయాజులు. 

మరి "కళాఖండం" యెలా? ఆయన ఇంటి ముందు ఓ మేడపై కొందరు హిప్పీలూ, అర్థరాత్రి శోకాలూ, మళ్లీ ప్రొద్దున్నే తులసి వచ్చేటప్పటికి పాటలూ, దానికి వాడి డ్యాన్సూ, సోముగారు వాడిని చెంపదెబ్బ కొట్టడం, మళ్లీ అర్థరాత్రి వాళ్ల రూముకి వెళ్లి, "రా రా రి రీ.....రిబ రిబ రిబ (ఇంకో మూడు సార్లు), రా రా రా రి రి రీ రీ......ఓయ్! అని పాడేసి, ఓ చిన్న లెక్చరు దంచేసి, వచ్చెయ్యడం! 

తన కూతుర్ని మండుటెండలో గోదావరిలో పీకలోతువరకూ ములగబెట్టి, చలికి వణుకుతున్నట్టూ, తెల్లవారుఝామున అలాగే చలిలో సంగీత సాధన చెయ్యాలి అన్నట్టూ ఓ సీను! (ఇది సామజవరగమనా కి పునాది!) 

"సామజ..." తరవాత కూతుర్ని "శారదా..." అంటూ తిట్టెయ్యడం, మహాకవి కాళిదాసు లెవెల్లో, చంద్రమోహన్ "మాణిక్యవీణాం....." పాడడం, ఆయన వాణ్ణి అల్లుడుగా వొప్పుకొని పెళ్లికి అంగీకరించడం....కొసమెరుపు! (అదంతా క్యామెడినే! కాకుండా ఇంకా అనేక "రసాలు" కూడా చూశారు 'సగటు' విమర్శకులు!)

సరే. క్లైమాక్స్ ముందే తీసేశాడుకదా. దానికి తగ్గ డైలాగులు...."ఆ దాత యెవరో....శిరసువంచి...." వగైరాలు. వారసుడిగా తులసిని ప్రకటిస్తూ, తన గండపెండేరం వాడికి తొడిగి, తనువు చాలించడం, ఆయన పాదాలపై వ్రాలి, మం. భా. కూడా చనిపోవడం.....! శహభ్భాష్! 

ఇంకేం! కళాఖండమంటే ఇదీ!

.........తరువాయి ఇంకోసారి.

Thursday, April 21, 2011

తెలుగు సినీ.....-2



......కళాఖండాలు--శంకరాభరణం

అసలు ఈయన (కే. విశ్వనాథ్) తో వచ్చిన గొడవేమిటంటే, తియ్యదలుచుకున్న సినిమాకి "స్క్రీన్ ప్లే" అంటూ వుండదు. వుంటే గింటే ఆయన బుర్రలోనే వుంటుంది. సినిమాకి ముఖ్యం అనుకున్న సీన్లు, క్యారెక్టర్లకోసం తనచుట్టూ తిరిగేవాళ్లనీ, హీరో హీరోయిన్లనీ పిలిచి గబగబా తీసేసి, వాటిని అతికేస్తాడు. తరవాత రషెస్ చూసి, అందులో బాగా ఆడడానికీ, కళాఖండం అని పేరు రావడానికీ యేమేమి లోపించాయో చూసి, మళ్లీ అవన్నీ రీళ్లు చుట్టేసి, ఆముక్కల్ని మళ్లీ సినిమాలో అతికించేస్తాడు. (నిజంగా అదొక కళ లెండి.)

ఈయనకీ, తెలుగు చిత్ర సీమకీ బాగా పేరు తెచ్చిన, ఇప్పటికీ "తరతరాల సాంప్రదాయాలని మరిచిపోకూడదు" అని చెప్పడానికి ప్రతీ వొక్కరూ వుపయోగించే "శంకరాభరణం" సినిమానే తీసుకోండి.

(అది ఓ కన్నడ సంగీత విద్వాంసుడి కథ అని కొందరంటారు.)

శంకర శాస్త్రి ఓ గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయనకి ప్రాణమైన రాగం శంకరాభరణం. ఆయన రాజమండ్రి గోదావరిలో, పుష్కరాల రేవులో మండుటెండలో స్నానం చేస్తూ, రాగాలు పాడుకొంటుంటే, ఓ బోగం పిల్ల (మంజు భార్గవి) ఆ లంకల్లో నాట్యం చేసేస్తూ వుంటుంది. 

ఈయనకి యెంత గోరోజనమంటే, ఓ సారి కచేరీ జరుగుతూ వుండగా, ఓ జమీందారు మంజుభార్గవీ వాళ్లమ్మతో మాట్లాడడానికి కుర్చీ లాక్కుని కూర్చుంటే, ఆ శబ్దాన్ని విని, కచేరీ ఆపేసి, వెళ్లిపోతాడు. (ఇలాంటి లక్షణాలవల్లనే ఆయనకి తరవాత కచేరీలు రాలేదు అని అర్థం రావడంలేదూ?)

సరే. మం. భా. ఓ రోజున ఆయన "శంకరాభరణమూ....." పాటని ఆస్వాదిస్తుండగా, (మధ్య మధ్యలో తానుకూడా పాడుకొంటూ, 'ఆహా...' అని పరవశిస్తూ వుంటే) ఆ జమీందారు వచ్చి, ఆవిడని "రేప్" చేసేసి వెళ్లిపోతాడు. (అక్కడ గ్రద్దా, పామూ బొమ్మ వ్రేళ్లాడం, రికార్డు అయిపోయాక కిర్రూ కిర్రూ అంటూ శబ్దం--ఇవీ సింబాలిజాలు.)

తరవాత ఆయన కన్నడదేశంలో కచేరీ చెయ్యడానికి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తూంటే, మం. భా. వచ్చి ఆయన పెట్టిలో యెక్కేస్తుంది. చాలా దర్పంగా బెంగుళూరులోనే అనుకుంటా, ఆయన దిగుతాడు. దండలతో స్వాగతం చెప్పడానికి వస్తారు--కచేరీ నిర్వాహకులు. కొంచెం గేప్ లో వెనకాలే మం. భా. దిగుతుంది. అక్కడ బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ సాధారణంగా యెవరూ గమనించి వుండరు--'యెంతవారలైనా, కాంతదాసులే!'--అంటూ! (అంటే దానర్థం? ఆయనకి కచేరీలు రాకుండా ఆగిపోవడానికి ఇదీ ఓ కారణమా?). నిర్వాహకులు ఈసడించుకొని, వెళ్లిపోతారు. ఆవిడని వాళ్లమ్మ తీసుకెళ్లిపోతుంది--యాగీ చేసి మరీ.

ఇంక అక్కడనించీ ఆయన ఇంట్లోనే వుండిపోయాడు అనుకోవాలి మనం. ఆయన కూతురు మడిగా నీళ్లు తెస్తూ, బిందె మొయ్యలేక కాలుజారి పడిపోతే, "నీకు వంట రాదా?" అని మం. భా. ని అడిగి, వండించుకు తింటాడు. (మళ్లీ ఆవిడ ఆయన యింటికి యెలా వచ్చిందో?) కులాలు మనుష్యులు యేర్పరచుకున్నవే, మన మనసుల్లోనే వుంటాయి అనో యేదో ఓ సందేశం అక్కడ.

తరవాత ఆమె మళ్లీ వేరే వూళ్లో ఓ పిల్లవాణ్ని (తులసి) కంటుంది. వాణ్ని మళ్లీ శంకర శాస్త్రి దగ్గరకి వెళ్లి, సంగీతం నేర్చుకోమంటుంది. (ఆ పిల్లవాడి తండ్రి జమీందారా? కాదు. శంకర శాస్త్రే అని నిర్ధారించడానికే ఆయన వారసుడిగా వాణ్ని క్లైమాక్స్ లో చూపించడం.)

సరే. ఆ కుర్రవాడు ఆయన సేవ చేసుకొంటూ, మళ్లీ ఓ విద్వాంసుడు అయిపోతాడు. క్లైమాక్స్ అందరికీ తెలిసిందే!

స్థూలంగా ఇదీ కథ. (నేను ఆ సినిమా రిలీజు అయినప్పుడు రెండో రోజునే భీమవరం వెంకట్రామా థియేటర్లో చూశాను. తరవాతోసారి 1990 ల్లో, వీసీపీలో చూశాను. అంతే. గుర్తున్నంతవరకూ వ్రాశాను. యేవైనా తప్పులు వ్రాస్తే, పూజ్య పాఠకులు నా దృష్టికి తీసుకు రండి.)

.........తరువాయి ఇంకోసారి.